కుమ్రం భీం అసిఫాబాద్ : మహారాష్ట్ర నుంచి ప్రాణహిత దాటి వచ్చే అపరిచిత వ్యక్తులు, ముఖ్యంగా మావోయిస్టులకు ఆశ్రయం కల్పించ వద్దని ఎస్పీ కె సురేష్ కుమార్ అన్నారు. ‘పోలీసులు మీకోసం’ కార్యక్రమంలో భాగంగా పెంచికల్పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని మోర్లీ గూడ గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సరిహద్దు, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలకు పోలీసుల ఆధ్వర్యంలో రోడ్డు సౌకర్యం కల్పిస్తామన్నారు. అలాగే రైతులు పంటలు పండించుకునేందుకు 3 ఫేస్ విద్యుత్ సౌకర్యం కూడా కల్పించామన్నారు.
గంజాయి ఊర్లో సాగు చేసినట్లయితే ఆ గ్రామానికి అందే సంక్షేమ పథకాలను ప్రభుత్వం నిలిపివేస్తుందన్నారు. ఎవరు కూడా మత్తు పదార్థాలకు బానిసలు కావొద్దన్నారు.
అనంతరం వృద్ధులకు 300 దుప్పట్లు, మూడు క్వింటాళ్ల బియ్యం, యువకులకు వాలీబాల్, క్రికెట్ కిట్లు పంపిణీ చేశారు. సిబ్బందితో కలిసి ప్రాణహిత పరివాహక ప్రాంతాన్ని సందర్శించారు. కార్యక్రమంలో డి.ఎస్.పి కరుణాకర్, కాగజ్ నగర్ రూరల్ సి.ఐ రాజేంద్ర ప్రసాద్, ఎస్ఐ రమేష్, తదితరులు పాల్గొన్నారు.