పెంచికల్పేట్, జనవరి 6 : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ అటవీ డివిజన్కు మరోసారి అరుదైన అవకాశం దక్కింది. కవ్వాల్ టైగర్ రిజర్వ్తో పాటు కాగజ్నగర్ డివిజన్లోని కాగజ్నగర్, సిర్పూర్, బెజ్జూర్, పెంచికల్పేట్లో ఈనెల 8,9న రెండో బర్డ్ వాక్ ఫెస్టివల్ నిర్వహించడానికి జిల్లా అటవీశాఖ సర్వం సిద్ధం చేసింది. పాలరాపు గుట్ట సహ తెల్లవారు జాము నుంచి సాయంత్రం 6 గంటల వరకు అడవుల్లోని 21 ప్రాంతాల్లో 250 పక్షి జాతులు కనువిందు చేయనున్నాయి. ఈ శీతాకాల సమయంలో శ్రీలంక, స్వీడన్, నైజీరియా దేశాలతో పాటు జమ్ముకశ్మీర్,తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర,ఒడిశా రాష్ర్టాల పక్షులు వలస వచ్చి తమ కిలకిల రావాలతో అటవీ ప్రాంతంలో సందడి చేస్తూ కొత్త శోభను సంతరించుకున్న శుభవేళ బర్డ్వాక్ ఫెస్టివల్ నిర్వహిస్తుండడంతో పక్షి ప్రేమికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పక్షుల సంరక్షణ, ప్రఖ్యాతను తెలియజేయడంతో పాటు కొత్త పక్షుల గుర్తింపు అధ్యయనం కోసం ఈ బర్డ్వాక్ ఫెస్టివల్ దోహదపడుతుంది. ఎంపిక చేసిన ప్రాంతాల్లో సందర్శకులు అధికారుల సమక్షంలో పక్షులను ప్రత్యక్షంగా వీక్షించవచ్చు.
నిబంధనల ప్రకారమే అనుమతి..
కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మాత్రమే పక్షులను వీక్షించే అవకాశం కల్పిస్తాం. ఒకరు రూ. 2వేల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. వివరాలకు ఆసిఫాబాద్ డీఎఫ్వో 9440810099, కాగజ్నగర్ ఎఫ్డీవో 9440810397, కాగజ్నగర్ డివిజన్ ఆఫీసులో నేరుగా సంప్రదించవచ్చు. వన్యప్రాణి శాస్త్రవేత్తలు, వైల్డ్లైఫ్ ఫొటోగ్రాఫర్లు, పక్షిప్రేమికులు పాల్గొనవచ్చు.