కుమ్రం భీం ఆసిఫాబాద్ : జిల్లాలో ఏప్రిల్ 13 వ తేదీన ప్రారంభం కానున్న ప్రాణహిత పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తామని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. శుక్రవారం ప్రాణహిత పుష్కరాల కోసం తుమ్మిడిహెట్టిలో ఏర్పాటు చేసిన పుష్కర ఘాట్ ను సిర్పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే కోనేరు కోనప్పతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ఏప్రిల్ 13 నుండి 24వ తేదీ వరకు 12 రోజుల పాటు జరుగునున్న పుష్కరాలకు వచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేయాలని తెలిపారు.
పుష్కర ఘాట్ సంబంధిత రహదారులు మరమ్మతు పనులతో పాటు ఘాట్ వరకు అప్రోచ్ రోడ్డు ఏర్పాటు చేయాలని, ఘాట్కు వెళ్లేందుకు భక్తులకు ఇబ్బంది లేకుండా దారి తెలిపే విధంగా సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండేవిధంగా సంబంధిత అధికారులుచర్యలు తీసుకోవాలని తెలిపారు. నదీతీరంలో లోతుగా ఉన్న ప్రాంతాలను గుర్తించి భక్తులు అటువైపు వెళ్లకుండా తగిన ఏర్పాట్లు చేయాలని, గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
నదిలోకి వెళ్లి స్నానం చేయడానికి వీలు లేని వారికి షవర్లు ఏర్పాటు చేయాలని, మహిళల కోసం బట్టలు మార్చుకునేందుకు తాత్కాలిక గదులు ఏర్పాటు చేయాలని, భక్తులకు తాగునీటిని అందుబాటులో ఉంచాలన్నారు. అత్యవసర వైద్య సేవల నిమిత్తం వైద్య సిబ్బందిని ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.