సీఎం ఆదేశాలతో పోలీసు, ఎక్సైజ్ శాఖల ముమ్మర చర్యలు
నిత్యం పల్లెల్లో దాడులు
నాటుసారా స్థావరాలు, గంజాయి మొక్కల ధ్వంసం
కేసులు నమోదు.. వాహనాలు స్వాధీనం
మత్తుకు అలవాటు పడ్డ యువతకు కౌన్సెలింగ్
మంచిర్యాల/కుమ్రం భీం ఆసిఫాబాద్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ) : గంజాయి సాగుపై సర్కారు ఉక్కుపాదం మోపుతున్నది. ఏజెన్సీ ప్రాంతాల్లో అంతర పంటగా సాగు చేస్తుండగా, పోలీసు శాఖ ప్రత్యేక నిఘా పెట్టి వరుస దాడులు చేస్తున్నది. మొక్కలను ధ్వంసం చేయడమే గాకుండా నిందితులను అరెస్ట్ చేస్తున్నది. ఇప్పటికే పలుచోట్ల యువత బానిసైనట్లు తెలుస్తుండగా, కౌన్సెలింగ్ నిర్వహిస్తూ వారిలో మార్పునకు కృషి చేస్తున్నది. ఇక నాటుసారా అమ్మకాలపై ప్రత్యేక దృష్టి పెట్టిన ఆబ్కారీశాఖ పూర్తిస్థాయిలో అడ్డుకట్ట వేసేందుకు చర్యలు చేపడుతున్నది. ప్రభుత్వ ఆదేశాలతో తయారీదారులకు ప్రత్యామ్నాయ ఉపాధి, పునరావాసం కల్పించేందుకు కసరత్తు చేస్తున్నది.
మత్తు పదార్థాల రహిత జిల్లాలుగా మార్చే లక్ష్యంతో రాష్ట్ర సర్కారు సమగ్ర ప్రణాళికతో ముందుకెళ్తున్నది. ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖల సమన్వయంతో గంజాయి, గుడుంబాలపై ఉక్కుపాదం మోపుతున్నది. గుడుంబా తాగి చనిపోతుండడంతో చిన్న వయసులోనే గిరిజన యువతులు వితంతువులుగా మారుతుండడం తన హృదయాన్ని కలిచివేసిందని ఇటీవల సమావేశంలో సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. గుడుంబా స్థానికంగానే తయారవుతున్నందున దాన్ని అరికట్టడం ఎక్సైజ్ శాఖకు సాధ్యమేనని ఆయన సూచించారు. గుడుంబా అమ్మకంపై జీవిస్తున్న వారికి ప్రత్యామ్నాయ ఉపాధి, పునరావాసం కల్పించాలని, అందుకు అవసరమైన నిధులను కలెక్టర్లకు విడుదల చేస్తామని చెప్పారు.
గంజాయి విక్రయాలపై..
జిల్లాలోని దండేపల్లి, జన్నారం, మంచిర్యాల, తాళ్ల గురిజాల, కాసిపేట తదితర ప్రాంతాల్లో గంజాయి సాగు, విక్రయాలపై అధికారులు అప్రమత్తమయ్యారు. గంజాయికి సంబంధించి రామగుండం కమిషనరేట్ పరిధిలో అధికారులు ఇప్పటి వరకు 29 కేసులు, జిల్లాలో 10 కేసులు నమోదు చేశారు. జన్నారం, దండేపల్లి, మంచిర్యాల, తాళ్లగురజాల, కాసిపేట తదితర ప్రాంతాల్లో కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. కమిషనరేట్ పరిధిలో రూ.1,85,650 విలువైన 51 కిలోలు గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. 70 మందిపై కేసులు నమోదు చేశారు. బెల్లంపల్లి డివిజన్లో ఈ యేడాది 8.4 కిలోల గంజాయిని పట్టుకున్నారు. 5 కేసులు నమోదు చేశారు. 21 మందిని అరెస్టు చేశారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో నెల రోజుల్లో 11 కేసులు నమోదు కాగా, 15 మందిని అదుపులోకి తీసుకున్నారు. తిర్యాణి మండలంలోని ఎర్రబండలో 400 గంజాయి మొక్కలు, సిర్పూర్-యులో 550, ఆసిఫాబాద్ మండలం తుంపల్లిలో 40 మొక్కలు, కాగజ్నగర్లో 14 మొక్కలు, జైనూర్లో 100 మొక్కలు ధ్వంసం చేశారు. మాదక ద్రవ్యాల నియంత్రణపై గ్రామాలు, పట్టణాల్లో పోలీసులు యువతకు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు గుడుంబా, గంజాయి కంట్రోల్లోనే ఉందని, కరోనా నేపథ్యంలో యువత మత్తు పదార్థాలకు బానిసైనట్లు సమాచారం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. సరిహద్దు ప్రాంతాల్లోని రాష్ర్టాలు, జిల్లాల నుంచి గంజాయి రవాణా అయినట్లు వారు తెలుపుతున్నారు.
గుడుంబాపై నిఘా..
గుడుంబా విక్రయాలపై అధికారులు నిఘా పెట్టారు. ని త్యం దాడులు చేస్తూ అడ్డుకట్ట వేయడమేగాకుం డా.. గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. 2021 జనవరి నుంచి అక్టోబర్ వరకు గుడుంబాకు సంబంధించి 100 కేసులు నమోదు చేశారు. 130 మంది నేరారోపణలు ఎదుర్కొంటున్నారు. రూ.7,89,528 విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. సీపీ చంద్రశేఖర్ రెడ్డి, డీసీపీ ఉదయ్కుమార్ రెడ్డి, జైపూర్ ఏసీపీ నరేందర్ ఆదేశాల మేరకు మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలంలో ఆబ్కారీ అధికారుల ఆధ్వర్యంలో మంగళవారం దాడులు నిర్వహించారు. బుయ్యా రం, జిల్లెడ, జక్కెపల్లి గ్రామాల్లో నాటు సారా స్థావరాలపై పోలీసులు, ఎక్సైజ్ శాఖ అధికారులు దాడి చేశారు. 2 వేల లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేసి, నలుగురిపై కేసు నమోదు చేశారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఏడా ది కాలంలో 293 గుండుబా కేసులు నమోదయ్యాయి. 257 మందికి గుంబా తయారీ, రవాణా కేసులు నమోద య్యాయి. 837 లీటర్ల నాటుసారాను అధికారులు స్వా ధీనం చేసుకున్నారు. 13,500 లీటర్ల బెల్లం పానకం ధ్వం సం చేశారు. 23 వాహనాలు, 763 కేజీల బెల్లం స్వాధీనం చేసుకున్నారు. గుడుంబా తయారీని జీవనాధారంగా చేసుకుని కేసుల్లో పట్టుబడ్డ 23 మందికి రూ. 2 లక్షల చొప్పున ఐటీడీఏ నుంచి ఆర్థిక సహాయం అందించారు. ఈ డబ్బులతో వీరికి ప్రత్యామ్నాయంగా ఉపాధిని కల్పించారు.
సరిహద్దుల నుంచి రవాణా..
మహారాష్ట్ర సరిహద్దున ఉన్న పెన్గంగ, ప్రాణహిత నదీతీరంతో పాటు మారుమూల అటవీప్రాంతాల్లో అంతర పంటలుగా గంజాయి సాగవుతున్నది. ప్రధానంగా ఆసిఫాబాద్ జిల్లాలోని గిరిజన ప్రాంతాలైన తిర్యాణి, సిర్పూర్-యు, కెరమెరి, ఆసిఫాబాద్, జైనూర్తో పాటు కాగజ్నగర్ ప్రాంతాల్లోని పంట చేలల్లో అంతర పంటగా గంజాయి సాగవుతున్నది. రైల్వేమార్గాలతో పాటు సామాన్యులుగా ఆటోలు, బస్సుల్లో రవాణా చేస్తున్నట్లు తెలుస్తున్నది. కొంతమంది బృందాలుగా పనిచేస్తూ దీనినే ఓ వృత్తిగా మార్చుకొని రవాణా చేస్తున్నారని సమాచారం. మహారాష్ట్రకు చెందిన గంజాయి ముఠా ఉమ్మడి జిల్లాలోని మారుమూల ప్రాంతాల అమాయక రైతులకు మాయమాటలు చెప్పి గంజాయి సాగును ప్రోత్సహిస్తున్నారు. ప్రధానంగా పత్తిలో దీనిని అంతర పంటగా సాగు చేస్తున్నారు. పంటల్లో చీడపీడలను నివారించేందుకు సాధారణంగా రైతులు బంతిపూల మొక్కలను నాటుతుంటారు. గంజాయి కూడా బంతి మొక్కలు పోలి ఉండడంతో కొన్ని చోట్ల వీటితో పాటు సాగు చేస్తున్నారు. గంజాయి అక్రమ రవాణాకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కేంద్రబిందువుగా మారింది. మంచిర్యాల, ఆదిలాబాద్లలో రైల్వే మార్గం ఉండడం అక్రమార్కులకు కలిసివస్తోంది. మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి కొనుగోలు దారులు వచ్చి, కొనుగోలు చేసి గుట్టుగా తరలిస్తుంటారు. గత నెలలో రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి ఆయా జిల్లాల పోలీసు అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో గంజాయి సాగుపై ప్రత్యేకంగా దిశానిర్దేశం చేశారు. జిల్లాల వారీగా ప్రత్యేక టాస్క్ఫోర్సును ఏర్పాటుచేశారు.
గంజాయి అమ్మినా, తాగినా, రవాణా చేసినా చర్యలు
మంచిర్యాల గర్మిళ్ల, అక్టోబర్ 29 : జిల్లాలో గుడుంబా నియంత్రణలో ఉంది. జిల్లాలో గంజాయి సాగవడంలేదని తెలిసింది. సమీపంలోని మహారాష్ట్ర, బల్లార్షా, తిర్యాణి ప్రాంతాల నుంచి వస్తున్నట్లు తెలుస్తున్నది. కరోనా నేపథ్యంలో యువత ఇంటి వద్దే ఉండడం, తల్లిదండ్రుల కంట్రోల్ లేకపోవడంతో మత్తు పదార్థాలకు అలవాటు పడ్డారు. బెల్లంపల్లి, మంచిర్యాల పట్టణాల్లోని కొంతమంది యువకులు మాదక ద్రవ్యాలకు అలవాటు పడ్డారని తెలిసింది. కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నాం. ప్రతి రోజూ పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నాం. గంజాయి తాగినా, అమ్మినా, రవాణా చేసినా వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటాం.