మంచిర్యాల కలెక్టర్ భారతీ హోళికేరి
మంచిర్యాల నుంచి వరంగల్ జాతీయ రహదారి పనులపై అధికారులతో సమావేశం
హాజీపూర్, ఆగస్టు 10 : మంచిర్యాల నుంచి వరంగల్ వరకు రసూల్పల్లి మీదుగా నిర్మించ తలపెట్టిన 25 కిలోమీటర్ల జాతీయ రహదారి జాయింట్ మేనేజ్మెంట్ సర్వేను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని కలెక్టర్ భారతీ హోళికేరి అన్నారు. జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ మధుసూదన్నాయక్, జాతీయ రహదారి ప్రాజెక్టు అధికారులు రఘునాథ్ పూలే (వరంగల్), రవీందర్రావుతో కలిసి రెవెన్యూ, ల్యాండ్ సర్వే, రోడ్లు – భవనాలు, అటవీ, గనులు భూగర్భ, నీటిపారుదల, విద్యుత్, ఉద్యానవన శాఖల అధికారులు, తహసీల్దార్లతో మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సర్వేను వీడియో తీసి త్వరగా పూర్తి చేయాలన్నారు. 2013 యాక్టు ప్రకారం పనులు నిర్వహించి నివేదిక అందించాలని ఆదేశించారు. సమావేశంలో మంచిర్యాల ఆర్డీవో వేణు, భూగర్భ గనుల అధికారి బాలు, రోడ్లు భవనాల శాఖ ఈఈ రాములు, తహసీల్దార్లు సంతోష్, రాజేశ్వర్, ల్యాండ్ సర్వే అధికారి శ్రీనివాస్, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఈ నెల 15 లోగా మెగా పార్కు పనులు పూర్తి చేయాలి
వేమనపల్లి, ఆగస్టు 10 : ఈ నెల 15లోగా మెగా పార్కు పనులు పూర్తి చేసి మొక్కలు నాటాలని కలెక్టర్ భారతీ హోళికేరీ అధికారులను ఆదేశించారు. మండలంలోని జిల్లెడ గ్రామ శివారులోని ప్రాణహిత కాలువ సమీపంలో ఏర్పాటు చేస్తున్న మెగా పార్కును మంగళవారం పరిశీలించారు. ఎన్ని మొక్కలు నాటారని అధికారులను అడిగి తెలుసుకున్నారు. 31 వేల మొక్కలకు 25 వేలు నాటామని ఎంపీవో బదులిచ్చారు. మిగితా మొక్కలను కూడా త్వరగా నాటి అందంగా తీర్చిదిద్దాలని సూచించారు. ఆమె వెంట డీపీవో నారాయణరావు, ఎంపీవో అనిల్కుమార్, వైస్ ఎంపీపీ ఆత్రం గణపతి, సర్పంచ్ సీహెచ్ కొండల్రెడ్డి, కార్యదర్శులు హరినాథ్, వెంకటేశ్, రాకేశ్ ఉన్నారు.