కుమ్రం భీం ఆసిఫాబాద్ (నమస్తే తెలంగాణ)/ కెరమెరి, మార్చి 24 : సర్కారు నిర్లక్ష్యం ఆ కొలాం గ్రామానికి శాపంగా మారింది. కేసీఆర్ ప్రభుత్వంలో మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగు నీరు సరఫరా కాగా, ప్రస్తుతం పైపులైన్కు మరమ్మతులు చేసే దిక్కు లేక ఆ ఊరి ప్రజానీకం అష్టకష్టాలు పడాల్సి వస్తున్నది. గొంతు తడుపుకునేందుకు కిలోమీటర్ దూరంలోనున్న వ్యవసాయ బావి వద్దకు కాలినడకన వెళ్లి నీరు తెచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొన్నది.
ఆ బావి కూడా అడుగంటితే ఎలా..?
కెరమెరి మండల కేంద్రానికి సుమారు 15 కిలోమీటర్ల దూరంలోనున్న పాటగూడలో సుమారు 50 కుటుంబాలు ఉంటాయి. ఇక్కడ ఒకే ఒక్క చేతి పంపు ఉండగా, భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో అందులో నుంచి నీరు రావడం లేదు. ఇక మిషన్ భగీరథ నీరందకపోవడంతో సుమారు కిలోమీటర్ దూరంలోనున్న బావి (ఉపాధి హామీ పథకం ద్వారా ఏర్పాటు చేసినది) నుంచి గ్రామస్తులు నీటిని తెచ్చుకొని అవసరాలు తీర్చుకోవాల్సి వస్తున్నది. ఎండలు ముదురుతుండగా, మరో 15.. 20 రోజుల్లో ఆ బావి కూడా అడుగంటి పోతే తమ పరిస్థితి ఏమిటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మిషన్ భగీరథ పైపులైన్పై పట్టింపు కరువు
కేసీఆర్ సర్కారు మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ నిర్మించి, ఇంటింటికీ నల్లాలు ఏర్పాటు చేసి నీరు సరఫరా చేసింది. కానీ, కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చాక నిర్వహణ లోపంతో పైపులైన్లు దెబ్బతిన్నాయి. మరమ్మతుల గురించి పట్టించుకున్న వారు లేకపోవడంతో తాగునీటి సమస్య మొదలైంది. తప్పనిసరి పరిస్థితుల్లో కిలోమీటర్ దూరంలోనున్న వ్యవసాయ బావి నుంచి తాగు నీరు తెచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొన్నది. మరికొన్ని రోజుల్లో ఈ బావి కూడా ఎండిపోతుందని, ఆ పరిస్థితిని తలుచుకుంటేనే భయంగా ఉందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం, చలికాలంలో ఎలాగోలా నెట్టుకొచ్చామని, ఈ ఎండాకాలం ఎలాగని ఆందోళన చెందుతున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి తాగు నీటి గోస తీర్చాలని వారు వేడుకుంటున్నారు.