మంచిర్యాల, మే 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మంచిర్యాల జిల్లా కేంద్రంలో దొంగ బంగారం క్రయవిక్రయాలు చేశారనే వార్తలు కలకలం రేపుతున్నాయి. సిద్దిపేట జిల్లాలో ఓ దొంగ చోరీ చేసిన సొత్తు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఓ జువెల్లరీ షాపులో విక్రయించినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ మేరకు సిద్దిపేట టూ టౌన్ సీఐ ఉపేందర్ గత శనివారం మంచిర్యాలలోని ఓ జువెల్లరీ షాపుకు వెళ్లి విచారించినట్లు విశ్వసనీయ సమాచారం. వివరాల్లోకి వెళ్తే.. బంగారం చోరీ చేసిన రెండు కేసుల్లో నిందితుడిగా ఉన్న ఓ వ్యక్తి జిల్లా కేంద్రంలోని జువెల్లరీ షాపు యజమానికి రూ.4 లక్షలకు విక్రయించినట్లు ఒప్పుకోవడంతో పోలీసుల అతడిని ఇక్కడికి తీసుకొచ్చి విచారణ చేసినట్లు సమాచారం.
మూడు నెలల 15 రోజుల క్రితం మీ షాపులో గోల్డ్ అమ్మినట్లు దొంగ చెబుతున్నాడని సదరు జువెల్లరీ షాపు యజమానిని అడుగగా, తాము షాప్ పెట్టే రెండు నెలలు అవుతుంది.. మూడు నెలల క్రితం ఎలా కొంటామని పోలీసులకు చెప్పినట్లు తెలిసింది. ప్రస్తుతం విచారిస్తున్న షాప్ కొత్తదని, పాత షాపులో ఈ యజమానికే బంగారం విక్రయించానని దొంగ చెప్పినట్లు తెలిసింది. దీంతో సదరు షాపు యాజమానిని విచారణకు రావాల్సిందిగా పోలీసులు కోరగా, మరుసటి రోజు వస్తానని చెప్పారు. ఆ రోజు రాత్రే సదరు షాపు యాజమాని ఆసుపత్రిలో జాయిన్ అయినట్లు తెలిసింది.
ఈ వ్యవహారం ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశమైంది. దొంగ బంగారం కేసు విచారణ కోసం జువెల్లరీ షాపుల యాజమానులందరూ ఏకమైనట్లు తెలుస్తుంది. అందుకే సిద్దిపేట పోలీసులు మంచిర్యాలకు వచ్చి వెళ్లిన నాటి నుంచి చాలా వరకు గోల్డ్ షాపులు మూసి ఉంటున్నాయి. దొంగ బంగారం విచారణ తమ షాపులపైకి వచ్చి పడుతుందోనన్న భయంతోనే నిర్వాహకులు షాపులు తీయడం లేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కాగా, గురువారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సుమారు 35 మంది షాపుల యజమానులు సిద్దిపేట పోలీసులను కలిసేందుకు వెళ్లినట్లు తెలిసింది.