ఆదిలాబాద్ రూరల్, జూన్ 24 : హరే రామ హరే కృష్ణ భజన సంకీర్తనలతో ఆదిలాబాద్ పట్టణం మారుమోగింది. భక్తులు భగవాన్ నామస్మరణ చేస్తూ భక్తి పారవశ్యంలో మైమరిచిపోయారు. పట్టణంలోని ప్రధాన వీధుల గుండా కొనసాగిన శ్రీశ్రీ జగన్నాథుని రథయాత్ర మహోత్సవంతో ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకున్నది. మహిళలు, యువతులు భజన సంకీర్తనల నడుమ ఉత్సాహంగా నృత్యాలు చేశారు. జిల్లా కేంద్రంలోని మధుర జిన్నింగ్ మిల్లు నుంచి శ్రీశ్రీ జగన్నాథుని రథయాత్ర ఉత్సాహభరిత వాతావరణంలో ప్రారంభమైంది.
రథయాత్ర మహోత్సవానికి అశేష జనం
ఇస్కాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జగన్నాథుని రథయాత్ర మహోత్సవానికి అశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమానికి పట్టణం నుంచే కాక జిల్లా నలుమూలల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. యూరప్కు చెందిన విదేశీ జంట సైతం పాల్గొనడం విశేషం. జగన్నాథుని ఉత్సవ విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించిన రథంలో ఉంచి రథోత్సవాన్ని చేపట్టారు. భక్తులు తాడును లాగుతూ రథాన్ని ముందుకు తీసుకెళ్లారు. భక్తి గీతాలకు యువతులు, మహిళలు ఉత్సాహంగా నృత్యాలు చేశారు.