శ్రీరాంపూర్/రెబ్బెన, డిసెంబర్ 22 : సింగరేణి ఆవిర్భావ వేడుకలకు వేళయ్యింది. శనివారం అట్టహాసంగా నిర్వహించేందుకు శ్రీరాంపూర్లోని ప్రగతి స్టేడియాన్ని యాజమాన్యం సిద్ధం చేసింది. భారీ బెలూన్లు ఏర్పాటు చేశారు. ఫుడ్, సూపర్ బజార్, ఎంవీటీసీ, రెస్క్యూ, వైద్యారోగ్య శాఖ స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రత్యేకంగా తెలంగాణ వంటకాలు సిద్ధం చేస్తున్నారు. జీఎం సంజీవరెడ్డి ఏర్పాట్లను పరిశీలించారు. ఇక బెల్లంపల్లి ఏరియాలోని గోలేటి శ్రీ భీమన్న క్రీడా మైదానంలో అన్నీ సిద్ధ చేశారు.
గోలేటి జీఎం కార్యాలయంతో పాటు శ్రీ భీమన్న క్రీడామైదానం రంగు రంగుల విద్యుద్దీపాలతో సరికొత్తగా కనిపిస్తున్నాయి. ఏరియా జీఎం రవిప్రసాద్ ఉదయం వివిధ గనులు, డిపార్టుమెంట్లలో జెండాలను ఆవిష్కరించనున్నారు. గ్రౌండ్లో వివిధ రకాల స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నారు. మహిళలు డప్పు చప్పుళ్ల నడుమ బోనాలు ఎత్తుకొని కోలాటం, బతుకమ్మ ఆడుతూ ర్యాలీగా తరలిరానున్నారు. అనంతరం జీఎం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాలను ప్రారంభిస్తారు. ఉపన్యాసాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఉత్తమ ఉద్యోగులకు సన్మానాలు ఉంటాయని అధికారులు తెలిపారు.