ఎదులాపురం, జూన్ 17 : రైల్వేశాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానని ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన ఒక మహిళ పది మంది వద్ద సుమారు రూ.49.40 లక్షలు వసూలు చేసింది. ఈ మేరకు శనివారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని వన్ టౌన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ ఉమేందర్ వివరాలు వెల్లడించారు. ఆదిలాబాద్ పట్టణంలోని బొక్కలగూడ కాలనీకి చెందిన తోట రజిత రైల్వేశాఖలో టీసీ ఉద్యోగాలు ఇప్పిస్తామని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పది మంది నుంచి దాదాపు రూ.49.40 లక్షలు తీసుకున్నట్లు తెలిపారు.
మోసం చేసిన వారిలో ఈమెతోపాటు హైదరాబాద్కు చెందిన మరో నలుగురు సంతోష్ సింగ్, కభీర్ సింగ్, మందిప్ సింగ్, శేషగిరిలు ఉన్నారని విచారణలో తెలిసిందన్నారు. అభ్యర్థులకు కాసిపేట రైల్వేస్టేషన్లో సంవత్సరం క్రితం శిక్షణ కూడా ఇచ్చారని తెలిపారు. నమ్మకం కలిగేలా నకిలీ ఆర్డర్కాపీలు, ఐడీ కార్డులను జారీ చేశారని పేర్కొన్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు శుక్రవారం సాయంత్రం మోచిగల్లిలోని ఆమె చెల్లి ఇంట్లో ఉన్నట్లు అందించిన సమాచారం మేరకు రజితను అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని తెలిపారు.