కెరమెరి, మార్చి 14: మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగిన ఇంటర్మీడియట్ పరీక్షలు గురువారంతో ప్రశాంతంగా ముగిశాయి. కెరమెరితో పాటు మోడిలోని కేజీబీవీ కళాశాలకు చెందిన మొదటి సంవత్సరం విద్యార్థులు మొత్తం 146 మందికి 140, ద్వితీయ సంవత్సరంలో 158 మందికి 156 మంది హాజరైనట్లు సీఎస్ పరశురాములు, డీవో సునీల్ కుమార్ తెలిపారు. మాస్ కాపీయింగ్కు పాల్పడకుండా పోలీసు బందోబస్తు మధ్య పరీక్షలు పకడ్బందీగా నిర్వహించినట్లు వెల్లడించారు.
వాంకిడి, మార్చి14: మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియార్ కళాశాలలో నిర్వహించిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు చివరి రోజు 188మంది విద్యార్థులకు 184మంది హాజరై, నలుగురు గైర్హాజరయ్యారని కళాశాల ప్రిన్సిపాల్ సంపత్కుమార్ తెలిపారు. పరీక్షలు ముగి యడంతో విద్యార్థులు ఆనందంతో కేరింతలు పెట్టారు.
జైనూరు, మార్చి14: మండల కేంద్రంలోని ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ పరీక్షలు ముగిసినట్లు కళాశాల ప్రిన్సిపాల్ శ్రీదేవి తెలిపారు. ఎలాంటి కాపీయింగ్ లేకుండా పోలీస్ బందోబస్తులో విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాసినట్లు వెల్లడించారు.
కౌటాల, మార్చి 14: మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన ఇంటర్మీడియెట్ రెండో సంవత్సరం పరీక్షల్లో 299 మంది విద్యార్థులకు గాను 10 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. 289 మంది పరీక్షలు రాసినట్లు సీఎస్ బాలకిషన్రావు, డీవో దౌలత్ తెలిపారు.
దహెగాం, మార్చి14: గత నెల 28న ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు గురువారంతో ముగిసినట్లు ప్రిన్సిపాల్ అమరేందర్ తెలిపారు.సెకండియర్లో 128 మంది విద్యార్థులకు గాను 122 మంది హాజరు కాగా ఆరుగురు గైర్హాజరైనట్లు పేర్కొన్నారు.
రెబ్బెన, మార్చి 14: రెబ్బెన మండలం ఇందిరానగర్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన ఇంటర్ పరీక్షలు ముగిసినట్లు పరీక్షల చీఫ్ సూపరింటెండెంట్ ప్రకాశ్ తెలిపారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలు బుధవారం, ద్వితీయ సంవత్సరం పరీక్షలు గురువారం పూర్తయ్యాయని చెప్పారు. వొకేషనల్ పరీక్షలు ఈ నెల 16న ముగియనున్నట్లు పేర్కొన్నారు.