ఎదులాపురం, ఆగస్టు 21 : ఆదిలాబాద్ సీసీఐ ఫ్యాక్టరీ పునరుద్ధరణ కోసం చేపడుతున్న ఉద్యమాన్ని రాష్ట్రస్థాయికి తీసుకెళ్లేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు మాజీ మంత్రి జోగు రామన్న తెలిపారు. హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అన్ని రాజకీయ పార్టీల రాష్ట్ర నాయకులు, మేధావులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న నాయకులు సీసీఐ పునరుద్ధరణకు తమ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ విలువైన సూచనలు, అభిప్రాయాలు వెల్లడించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి, బీఆర్ ఎస్ నాయకుడు జోగు రామన్న మాట్లాడుతూ.. ఆదిలాబాద్ సీసీఐ పునరుద్ధరణ అనేది కేవలం ఒక ప్రాంతానికి సంబంధించిన సమస్య కాదని, వేలాది కుటుంబాల జీవనోపాధితో ముడిపడి ఉన్న అంశమని అన్నారు. సీసీఐని పునఃప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం స్పందించి ఫ్యాక్టరీ పునరుద్ధరణకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. సీసీఐ పునరుద్ధరణ కోసం రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాలు ఏకతాటిపైకి వచ్చి ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. అవసరమైతే రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, మేధావులను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. సీసీఐ సాధన కమిటీ చేస్తున్న పోరాటానికి అన్ని వర్గాల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తుందన్నారు.
ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ఎమ్మెల్సీ కోదండరాం, ప్రొఫెసర్ నాగేశ్వర్, జస్టిస్ చంద్రకుమార్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు దాసోజు శ్రవణ్, న్యూ డెమోక్రసీ నేత చలపతిరావు, ఏఐఎఫ్డీబీ రాష్ట్ర కార్యదర్శి జోజిరెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, మాస్లైన్ రాష్ట్ర నాయకులు నంది రామయ్య, టీఎన్జీవ్సో మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కారం రవీందర్ రెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బండారి రవికుమార్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి నాగరాజు, పీడీఎస్యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి మంద నవీన్, సీసీఐ సాధన కమిటీ కన్వీనర్ దర్శనాల మల్లేశ్, కో-కన్వీనర్లు ఇజగిరి నారాయణ, లోకారి పోశెట్టి, కొండ రమేష్, జగన్ సింగ్, వెంకట్ నారాయణ, సంగేపు బొర్రన్న, ముడుపు ప్రభాకర్ రెడ్డి, చిలుక దేవదాస్, ఈశ్వర్దాస్, జిల్లా నాయకులు బొజ్జ ఆశన్న, భుట్టి శివ, వాగ్మారె ప్రశాంత్, అశోక్, మాడవి గణేష్ పాల్గొన్నారు.