రెండో సారి జాతీయ ఉత్తమ అవార్డుకు ఎంపికైన ఇంద్రవెల్లి పీహెచ్సీ
మెరుగైన సేవలకు గుర్తింపునిచ్చిన కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ
ఇంద్రవెల్లి, నవంబర్24 : ఇంద్రవెల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అరుదైన ఘనత సాధించింది. రెండోసారి జాతీయ ఉత్తమ అవార్డుకు ఎంపికై ఆదర్శంగా నిలిచింది. ఇటీవల పర్యటించిన నాణ్యతా ప్రమాణాల సంస్థ మెరుగైన వైద్య సేవలు, పెద్ద సంఖ్యలో ప్రసవాలు, స్వచ్ఛమైన వాతావరణం తదితర అంశాలను పరిశీలించి ప్రశంసించింది. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్య శాఖ జాతీయ ఉత్తమ అవార్డుకు ఎంపిక చేసినట్లు ఇటీవల ఉత్తర్వులు వెలువరించగా, సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ డివిజన్ పరిధిలోని ఇంద్రవెల్లి పీహెచ్సీ రెండోసారి జాతీయ ఉత్తమ అవార్డుకు ఎంపికై ఆదర్శంగా నిలిచింది. నాణ్యతా ప్రమాణాల సంస్థ తనిఖీ బృందం ప్రతినిధులు అభిషేక్, ఆనందిగుప్తా అక్టోబర్ 13, 14వ తేదీల్లో తనిఖీ చేసి పలు అంశాలను పరిశీలించారు. ప్రజలకు మెరుగైన వైద్యంతో పాటు పూర్తి సౌకర్యాలు అందుబాటులో ఉండడం, పరిశుభ్రమైన వాతావరణం, ప్రతి నెలా 45 నుంచి 50 దాకా ప్రసవాలు జరగడం వంటి తదితర అంశాలను పరిగణలోకి తీసుకున్నారు. ఈ మేరకు జాతీయ స్థాయి ఉత్తమ అవార్డుకు ఎంపిక చేస్తూ ఇటీవల కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ ఉత్తర్వులు వెలువరించగా, సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
పీహెచ్సీలో మెరుగైన వైద్యం..
ఇంద్రవెల్లి పీహెచ్సీలో మెరుగైన వైద్య సేవలు అందుతుండడంతో రోగులు ఇక్కడికి వచ్చేందుకు ఆసక్తి చూపుతుంటారు. ప్రధానంగా గర్భిణులకు మెరుగైన సేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ ముగ్గురు వైద్యులు, 30 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. మండల ప్రజల కోసం ప్రత్యేకంగా ఐటీడీఏ నుంచి అవ్వాల్ అంబులెన్స్, 102, ముత్నూర్లో 108 అంబులెన్స్లను అందుబాటులో ఉంచారు. ఈ దవాఖాన పరిధిలో ఆరు సబ్ సెంటర్లు ఉన్నాయి. వైద్య సిబ్బంది పల్లెల్లో పర్యటిస్తూ ప్రభుత్వ వైద్యంపై అవగాహన కల్పిస్తున్నారు. గర్భిణులతో పాటు బాలింతల వివరాలు సేకరించి ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. పీహెచ్సీలో ప్రతీ సోమవారం గర్భిణులకు వైద్యపరీక్షలు నిర్వహించి, నెలకోసారి స్కానింగ్ చేస్తారు. ఆ మేరకు వారికి వైద్యం అందిస్తున్నారు. ఇంద్రవెల్లి పీహెచ్సీకి తీసుకురావడానికి, తిరిగి చేర్చడానికి ఐటీడీఏ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా అవ్వాల్ పేరిట ప్రత్యేక అంబులెన్స్ ఏర్పాటు చేశారు. మరోవైపు ఇంద్రవెల్లి పీహెచ్సీకి జిల్లా కేంద్రం నుంచి ప్రత్యేక వైద్య సిబ్బంది వచ్చి ప్రతి రోజూ 10 నుంచి 15 మందికి రక్త నమునాలు సేకరిస్తున్నారు. ఆపై జిల్లా కేంద్రంలోని రిమ్స్కు పంపిస్తారు. వ్యాధి నిర్ధారణ తర్వాత ఇక్కడి వైద్యులు ఆ మేరకు సేవలు అందిస్తారు.
పెద్ద సంఖ్యలో ప్రసవాలు.. కేసీఆర్ కిట్లు..
ఇంద్రవెల్లి పీహెచ్సీలో మెరుగైన వైద్య సేవలు అందుతుండడంతో గర్భిణులు ఇక్కడికి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ దవాఖానలో ప్రతి నెలా 35 నుంచి 40 దాకా ప్రసవాలు జరుగుతున్నాయి. ఒక్క ఈ ఏడాదిలోనే 559 ప్రసవాలు జరిగాయి. 2017 నుంచి 2021 వరకు 2172 ప్రసవాలు నిర్వహించగా, ఇందులో అర్హులైన 1455 మంది బాలింతలకు కేసీఆర్ కిట్లను అందించారు. మిగిలిన 717 మంది బాలింతలకు మూడో కాన్పులు కాగా, వాటిని అందించలేదు. ఇక్కడ ప్రసవం చేయించుకున్న బాలింతలకు ప్రభుత్వం రూ. 13 వేల చొప్పున అందిస్తున్నది.
పీహెచ్సీ అభివృద్ధికి మరింత కృషి
ఏజెన్సీ అదనపు వైద్యాధికారి కుడిమేత మనోహర్ ఇంద్రవెల్లి పీహెచ్సీపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. దీనిని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తాం. ఇక్కడికి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తున్నాం. ప్రసవాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాం. పీహెచ్సీ ఆవరణలో అన్ని రకాల మొక్కలు నాటి అందంగా తీర్చిదిద్దాం. వాహనాల పార్కింగ్ కోసం ఏర్పాట్లు చేశాం. సమావేశాలు నిర్వహించేందుకు ఐటీడీఏ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశ హాల్ నిర్మించారు. విద్యుత్ కోతలను అధిగమించేందుకు సోలార్ను ఏర్పాటు చేశాం. ఇంద్రవెల్లి పీహెచ్సీకి జాతీయ ఉత్తమ అవార్డు రావడం ఆనందంగా ఉంది. ఇందుకు ప్రజాప్రతినిధులు, ప్రజల సహకారం ఉంది.