తాంసి, మే 30 : మండలంలో గత ప్ర భుత్వం నిర్మించిన మత్తడి ప్రాజెక్టు ఉండ గా ప్రస్తుతం 15 వరకు చెరువులు ఉన్నా యి. మత్తడి ప్రాజెక్టు ఎడమ కాల్వ నుంచి వడ్డాడి, జామిడి, బండల్నాగపూర్, కప్ప ర్ల, పొచ్చర, జందాపూర్ రైతుల పంట పొ లాలకు నీరందుతుంది. నవంబర్ 7న ప్రా రంభమైన నీటి విడుదల ఏప్రిల్ చివరి దా కా పారకం కొనసాగుతున్నదని ఏఈ హరీశ్కుమార్ తెలిపారు.
పెరిగిన సాగు విస్తీర్ణం..
గతంతో పోలిస్తే పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. ఎడమ కాలువ నుంచి వారబందీ పద్ధతిలో కాకుండా నిరంతరం సాగునీరు అందిస్తున్నారు. దీంతో మండలంలో 8500 ఎకరాల్లో పంటలు సాగు అవుతున్నాయి. అలాగే కుంటలను నింపడం ద్వారా భూగర్భజలాలు పెరగడంతో చెరువుల పరిధిలోని బావుల్లో పుష్కలంగా నీరు చేరి రైతులకు నీటి ఎద్దడి అనేదే లేకుండా పోయింది. బావులు, బోర్ల ద్వారా వందల ఎకరాలకు నీరందుతున్నది. మండలంలో 10 కిలో మీటర్ల ఎడమ కాల్వలు లింక్, డిస్ట్రిబ్యూటరీ కెనాళ్లు ఉన్నాయి. బండల్ నాగపూర్ నుంచి వచ్చే కాలువ వడ్డాడి నుంచి ప్రారంభమై జామిడి, కప్పర్ల, ఆదిలాబాద్ రూరల్ మండలంలోని పొచ్చర, జందాపూర్, దిమ్మ గ్రామాలకు సాగునీరు అందనుంది.
అలాగే మత్తడి ప్రాజెక్టు కుడి కాలువ ద్వారా చివరి ఆయకట్టుకు నీరందించే ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. కాలువల పద్ధతి కాకుండా పైప్లైన్ విధానాన్ని అమలు చేస్తున్నది. రూ.7.34 కోట్లతో 9 కిలో మీటర్ల మేర పైప్లైన్ వేశారు. ప్రాజెక్టు పనులు పూర్తయి ట్రయల్ రన్కు సిద్ధమైంది. ఈ కాలువ ద్వారా తాంసి మండల హుస్నాపూర్, వడ్డాడి, తలమడుగు మండలం ఖోడద్, ఆదిలాబాద్ రూరల్ మండలం పొచ్చర గ్రామాల్లోని 1200 ఎకరాలకు సాగునీరు అందించాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఈ మేరకు అధికారులు 9 కిలో మీటర్ల పైప్లైన్ వేశారు. రైతుల భూముల్లో పైపులు వేయడానికి 3 నుంచి 4 మీటర్లు తవ్వి పనులు పూర్తయిన తర్వాత పూడ్చేశారు. రాష్ట్రంలోనే తొలిసారి పైప్లైన్ ద్వారా రైతులకు సాగునీరు అందించేందుకు శ్రీకారం చుట్టింది.
కానరాని కరువు..
గతంలో మార్చి మధ్యలో నుంచే భూగర్భ జలాలు అడుగంటి పోయేవి. దీంతో పంట పొలాలు పెద్ద మొత్తంలో ఎండిపోయేవి. రైతులు తీవ్రంగా నిరాశకు గురయ్యేవారు. పెట్టుబడులు పెట్టి నష్టపోయేవారు. ఎండిపోయిన పంట పొలాలు పశువుల మేతగా మారేది. కాలువల ద్వారా పుష్కలంగా నీళ్లు అందుతుండడంతో మండలంలో కరువు దూరమైంది. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి సారించడంతో క్షేత్రస్థాయిలో రైతులకు మేలు జరుగుతున్నది. అన్నదాతల్లో ఆనందం వ్యక్తమవుతున్నది.
రైతులు, మత్స్యకారుల సంబురం
మత్తడి చెరువుల్లోకి పుష్కలంగా నీరు చేరడంతో చెరువుల ఆయకట్టు కింద ఆధారపడి జీవిస్తున్న రైతులు, మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు చెరువుపై ఆధారపడ్డ మత్స్యకారులు చెరువులు ఎండిపోతున్న క్రమంలో చేపలు చనిపోవడంతోపాటుగా చెరువుల్లో నీరు తగ్గుతున్నప్పుడే చేపలు పట్టే వారు. దీంతో ఆ సమయంలో తక్కువ రేటు ఉండేది. అగ్గువ సగ్గువకే అమ్ముకునేది. కానీ ఇప్పుడు వేసవిలో పుష్కలంగా వచ్చి నీళ్లు చేరుతుండడంతో మార్కెట్లో చేపలకు ధర పలికినప్పుడల్లా అమ్ముకొని లాభపడే అవకాశం మత్స్యకారులకు కలిగింది. చెరువుల్లో నీళ్లు చేరుతుండడంతో రైతులు, మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఒకప్పుడు యాసంగి సీజన్ వచ్చిందంటే ఎండిన చెరువులు, కుంటలు, నెర్రలు బారిన పంట పొలాలతో చాలా గ్రామాల్లో కరువు ఛాయలు కనిపించేవి. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కృషితో పరిస్థితులు పూర్తిగా మారాయి. మిషన్ కాకతీయ పథకంతో గ్రామాల్లోని చెరువులు జలకళను సంతరించుకున్నాయి. పచ్చని పంటలతో పొలాలు కళకళలాడుతున్నాయి.
గిట్ల ఎన్నడూ నీళ్లు రాలే
ఎండకాలంలో గిట్ల ఎన్నడూ ఈ నీళ్లు రాలే. ఇప్పుడు అచ్చినయ్. మా పంటలకు ఇక ఢోకా లేదు. నాకు ఈ మత్తడి వాగు చెరువు కింద రెండెకరాలున్నది. ముందు నీళ్లు అందక పంట సరిగా పండక పోయేది. గొడ్డూగోదకు కూడా తాగేటందుకు నీళ్లు దొరకకపోయేది. పుష్కలంగా నీళ్లత్తున్నై. మాకిగ ఏ బాధ లేదు. రెండు కాలాల్లో బాగా పంటలు పండుతయ్.
– సూరం ఆశన్న, రైతు, వడ్డాడి
ఆశయం నెరవేరుతున్నది
రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మం డల వ్యాప్తంగా దాదాపు అన్ని గ్రామాలకు సాగు నీరందింలేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇప్పటికే మత్తడి వాగు ప్రాజెక్ట్ నుంచి ఎడమ కాలువ ద్వారా రైతుల పంటలకు సాగునీటిని అందిస్తున్నాం. రానున్న రోజుల్లో అన్ని గ్రామాల్లో ప్రతి ఎకరాకు సాగు నీరందించేందుకు కృషి చేస్తున్నాం.
– కుంట సరితాకేశవ్ రెడ్డి, సర్పంచ్, జామిడి
రైతుల ఇబ్బందులు తీరినయ్
రాష్ట్రం ఏర్పడ్డాక వ్యవసాయం రంగం రూపురేఖలు మారిపోయాయి. ఉమ్మడి రాష్ట్రంలో చుక్క నీటి కోసం ఇబ్బందులు పడిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టులు, చెరువులు, చెక్ డ్యాంల నిర్మాణం, మిషన్ కాకతీయతో మరమ్మతులు చేపట్టి రెండు పంటలకు సరిపడా సాగునీటి అందిస్తున్నది. దీంతో రైతులు ఇబ్బందులు తీరినయ్.
రత్న ప్రకాశ్కృష్ణ, బీఆర్ఎస్ నాయకుడు, తాంసి
1200 ఎకరాలకు సాగునీరు
తెలంగాణ ఏర్పడ్డాక రాష్ట్ర ప్రభుత్వం 2017లో రూ.7.34 కోట్లతో కుడి కాలువ నిర్మాణాన్ని చేపట్టిం ది. లీకేజీలు లేకుండా పైప్లైన్ ద్వారా రైతులకు సాగునీరు అం దించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. తాంసి, తలమడుగు, ఆదిలాబాద్ రూరల్ మండలాల్లోని 1200 ఎకరాలకు సాగునీరు అందించేందుకు పనులు పూర్తి చేస్తున్నాం. త్వరలో మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ చేతుల మీదుగా ప్రారంభిస్తాం.
సురకుంటి మంజులశ్రీధర్ రెడ్డి, ఎంపీపీ