బోథ్, సెప్టెంబర్ 11 : ఆదిలాబాద్ జిల్లాలో శనివారం రాత్రి నుంచి ఆదివారం వరకు ఎడతెరిపిలేకుండా వర్షం కురిసింది. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. బోథ్లో 74.8 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. బోథ్, మర్లపల్లి, సొనాల, కౌఠ(బీ), పట్నాపూర్, అందూర్, ధన్నూర్ (బీ) ప్రాంతాల్లో వాగులు ఉప్పొంగి ప్రవహించాయి. రాత్రి సమయంలో అందూర్ మార్గంలో లోలెవల్ వంతెనపై నుంచి వరద పారడంతో రెండు గ్రామాల ప్రజలకు రాకపోకలు నిలిచిపోయాయి. పత్తి, సోయాబీన్ పంట చేన్లలో వర్షపు నీరు నిలిచిపోయింది. గత నెలలో కురిసిన వర్షాలు ఈ మధ్యనే తెరిపినివ్వడంతో పత్తి, సోయా పంటలు పెరుగుతన్న తరుణంలో మళ్లీ రెండు రోజులుగా కురుస్తున్న వర్షంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. పంటలకు నష్టం చేకూర్చే పరిస్థితులు కనిపిస్తున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు.
గుడిహత్నూర్లో..
మండలంలోని వాగులు పొంగిపొర్లుతున్నాయి. వాగులకు ఇరువైపులా ఉన్న పంట పొలాలు నీట మునిగిపోయాయి. మారుమూల గ్రామాల్లో రోడ్లపైకి నీరు రావడంతో పలువురు ఇబ్బందులు పడ్డారు.
నేరడిగొండలో..
మండలంలోని సావర్గాం, సేవ్దాస్నగర్ వాగులు ఉప్పొంగి ప్రవహించడంతో అటువైపు ఉన్న గ్రామాల ప్రజలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వర్షాలతో పత్తి, సోయా పంటలకు నష్టం కలుగవచ్చని రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఉట్నూర్లో ..
మండలంలోని నర్సాపూర్(జే), వంకతుమ్మ గ్రామాల వాగులు పొంగి పొర్లాయి. డివిజన్ కేంద్రంలో ప్రతి వారం నిర్వహించే సంతలో ప్రజలు, వ్యాపారులు లేక నామమాత్రంగా సాగింది.
ఇంద్రవెల్లి మండలంలో..
మండలంలోని జైత్రంతండా, జెండాగూడ, వడగాం, హీరాపూర్, వాల్గొండ, మామిడిగూడ, దస్నాపూర్, పాఠగూడ గ్రామాల్లోని వాగులు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోకి వరద చేరడంతో జలమయంగా కనిపిస్తున్నాయి. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షంతో పశువుల కాపర్లు పశువులకు మేతకు తరలించడంలో ఇబ్బందులు పడుతున్నారు.
భీంపూర్లో..
గుబ్డి, కరంజి(టీ), గోముత్రి, అంతర్గాం, వడూర్, గొల్లగడ్, తాంసి(కే) గ్రామాల వద్ద పెన్గంగ ఉధృతంగా ప్రవహిస్తున్నది. కరంజి(టీ), అంతర్గాంలోని వాగులు ఉప్పొంగి ప్రవహించడంతో గుబ్డి, కొజ్జన్గూడ, టేకిడిరాంపూర్ గ్రామాల ప్రజలకు రాకపోకలు నిలిచిపోయాయి. వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని భీంపూర్ పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు.
సాత్నాల గేట్ల ఎత్తివేత…
మండలంలో 20 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ఎగువన కురుస్తున్న వర్షాలతో సాత్నాల ప్రాజెక్టులోకి భారీగా వరద వచ్చి చేరుతుంది. ఇంజినీరింగ్ అధికారులు ప్రాజెక్టు ఒక గేటు ద్వారా నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టులో 1200 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండడంతో 1300 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
మత్తడి ప్రాజెక్టు..
వడ్డాడి మత్తడివాగు ప్రాజెక్టులోకి భారీగా వరద వచ్చి చేరుతుంది. సంబంధిత ఇంజినీరింగ్ అధికారులు మూడు గేట్ల ద్వారా దిగువనకు నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టులో 12వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా.. 12వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పరివాహక గ్రామాల ప్రజలు, పశువుల కాపరులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.