మంచిర్యాల, జూన్ 7(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : కలెక్టర్ నుంచి మొదలుకొని మిగిలిన శాఖలన్నీ ఒకే దగ్గర ఉండాలనే ఉద్దేశంతో అన్ని జిల్లాల్లో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాలను(ఐడీవోసీ) రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్నది. అధునాతన సౌకర్యాలు, సకల హంగులతో రూపుదిద్దుకుంటున్న నూతన కలెక్టరేట్ కార్యాలయాలు కార్పొరేట్ను మించి ఉంటున్నా యి. ఆకట్టుకునే నిర్మాణ ఆకృతి, భారీ చాంబర్లతో చూపరులను కట్టిపడేస్తున్నాయి. మంచిర్యాల శివారు లో నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలో రూ.55.22 కోట్లతో నిర్మించిన ఐడీవోసీ నూతన కార్యాలయం పనులు పూర్తి చేసుకొని ప్రారంభానికి సిద్ధమైంది. శుక్రవారం ముఖ్యమంత్రి కేసీఆర్ కలెక్టరేట్ను ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో ‘మంచిర్యాల ఐడీవోసీ’పై ‘నమస్తే’ తెలంగాణ ప్రత్యేక కథనం..
26.24 ఎకరాల విస్తీర్ణంలో..
నూతన కలెక్టరేట్ కార్యాలయానికి 26.24 ఎకరాల్లో పూర్తి చేశారు. ఇందులో ప్రధానమైన ఐడీవోసీ బిల్డింగ్ను 1,39,468 చదరపు అడుగుల విస్తీర్ణంలో జీ ప్లస్ టూ విధానంలో నిర్మించారు. అన్ని కలెక్టరేట్ల మాదిరిగానే గ్రౌండ్ఫ్లోర్లో కలెక్టర్, అదనపు కలెక్టర్ల చాంబర్లు, రెండు వెయింటింగ్ హాల్స్, రెండు వీడియో కాన్ఫరెన్స్ హాల్స్ ఉన్నాయి. దీనితోపాటు 500 మందితో ఒకేసారి సమావేశం నిర్వహించే భారీ కాన్ఫరెన్స్ హాల్, అధికారుల సహాయకుల కోసం అదనంగా గదులను కేటాయించారు. మొదటి ఫ్లోర్లో స్టేట్ చాంబర్, దానికి అనుసంధానంగా ఒక స్టాఫ్ రూమ్, వెయిటింగ్ హాల్ ఏర్పాటు చేశారు. ప్రతి ఫ్లోర్లో 40 మంది కెపాసిటీ ఉన్న కాన్ఫరెన్స్ హాల్స్ను సిద్ధం చేశారు. వివిధ శాఖల కోసం టైప్-ఏ హాళ్లు 8, టైప్ బీ హాల్స్ 12, టైప్ సీ హాల్స్ 24, టైప్ డీ హాల్స్ 34, టైప్ ఈ హాల్స్ 52 ఉన్నాయి. ఒక రికార్డు రూమ్, ఒక స్ట్రాంగ్ రూమ్తోపాటు ప్రతి ఫ్లోర్కు ఒక లంచ్ రూమ్ ఉంది. ప్రతి ఫ్లోర్లో ఒక పబ్లిక్ టాయిలెట్, రెండు వీఐపీ టాయిలెట్స్ కట్టారు. కార్యాలయం చుట్టూ నాలుగు లిఫ్ట్లను ఏర్పాటు చేశారు.
పర్యావరణ హితంగా కొత్త భవంతి..
ఎకో అడ్మినిస్ట్రేటివ్ సెంటర్(పర్యావరణహిత పరిపాలన కేంద్రం)గా కొత్త కలెక్టరేట్ కార్యాలయాన్ని నిర్మించారు. కార్యాలయం ఎదుట, మధ్యలో గ్రీనరీకి అధిక ప్రాధాన్యం ఇచ్చారు. లోపల గార్డెనింగ్ పనులు పూర్తికాగా, బయట 90 శాతం వరకు అయ్యాయి. గురువారం మధ్యాహ్నానికి మిగిలిన పనులు పూర్తి చేయనున్నారు. మంచిర్యాలతోపాటు నస్పూర్, లక్షెట్టిపేట, చెన్నూర్, రామకృష్ణాపూర్ నుంచి కొన్ని రోజులుగా మున్సిపల్ సిబ్బందిని ఈ పనులకే కేటాయించారు. గ్రౌండ్ ఫ్లోర్లో సమీకృత భవన సముదాయం మధ్యలో 16,500 చదరపు అడుగుల్లో ఏర్పాటు చేసిన సెంట్రల్ కోర్ట్ యార్డ్, అందులోని పౌంటేయిన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. కార్యాలయం ఎదుట భారీ జాతీయ జెండా, పబ్లిక్ ఈవెంట్స్ కోసం 1.5 ఎకరాల లాన్ ఏరియా ఆకట్టుకుంటుంది. కార్యాలయ ఆర్చీ నిర్మాణం పూర్తయ్యింది. ఒకేసారి 66 కార్లు నిలిపేలా పార్కింగ్ ఏరియా ఇచ్చారు. ముందు ఓ వైపున హెలిఫ్యాడ్ను సిద్ధం చేశారు. 9వ తేదీన సీఎం కేసీఆర్ ఇక్కడే నేరుగా హెలికాప్టర్లో దిగేలా ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు తెలిపారు.