నమస్తేతెలంగాణ నెట్వర్క్ : ఉమ్మడి జిల్లాలో కలర్ఫుల్ జోష్ కనిపించింది. మంగళవారం ఉదయం నుంచే హోలీ సంబురాలు అంబరాన్నంటాయి. చిన్నాపెద్దా తేడాలేకుండా వీధుల్లోకి వచ్చి ఒకరికొకరు రంగులు పూసుకున్నారు. డప్పు చప్పుళ్ల నడుమ కేరింతలు కొడుతూ నృత్యాలతో హోరెత్తించారు. పలుచోట్ల వివిధ శాఖల ఉన్నతాధికారులు సిబ్బందితో కలిసి సందడి చేశారు. ఇక జడ్పీ చైర్పర్సన్లు, ఎమ్మెల్యేలకు శుభాకాంక్షలు తెలిపేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు తరలిరావడంతో వారి నివాసాలు కిటకిటలాడాయి.
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో మంగళవారం హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. హైదరాబాద్ గచ్చిబౌలిలోని తన నివాసంలో అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి సంబురాలను ఘనంగా జరుపుకున్నారు. సహజసిద్ధమైన రంగులతో వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలకు మంత్రి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఆదిలాబాద్లో ఎమ్మెల్యే జోగు రామన్న, కలెక్టర్ రాహుల్ రాజ్, ఎస్పీ డీ ఉదయ్ కుమార్ రెడ్డి ఒకరి ఒకరు రంగులు పూసుకొని హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని తన నివాసం ఎదుట జరిగిన వేడుకల్లో బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ పాల్గొన్నారు.
ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి హైదరాబాద్లోని ఎమ్మెల్యే క్వార్టర్స్లో జరిగిన హోలీ సంబురాల్లో పాల్గొన్నారు. నిర్మల్లోని ఎస్పీ క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ వరుణ్ రెడ్డితో కలిసి వేడుకల్లో ఎస్పీ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకున్నారు. ఆదిలాబాద్ మాజీ ఎంపీ గొడాం నగేశ్కు నాయకులు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఉట్నూర్ మండలం లక్కారంలోని రాజ్దేవుషా గూడ గ్రామంలో జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ గ్రామస్తులతో కలిసి డోలు వాయిస్తూ సంబురాల్లో పాల్గొన్నారు. తలమడుగు మండలం రుయ్యాడిలో డెయిరీ డెవలవ్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ లోక భూమారెడ్డి గ్రామస్తులు, కార్యకర్తలతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు.