ఎదులాపురం, నవంబర్ 30 : ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నతాధికారులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూరాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ఉపయోగించుకోవాలని అవగాహన కార్యక్రమాలు చేపట్టిన అధికారులు, వారు ఓటు వేసి ఆచరణలో చూపించారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్, ఎస్పీ డీ ఉదయ్కుమార్ రెడ్డి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. డైట్ కళాశాలలోని 261 పోలింగ్ కేంద్రంలో కలెక్టర్ రాహుల్ రాజ్, శ్రీజ దంపతులు సామన్య ఓటర్లుతో కలిసి క్యూలో నిలబడి తమ ఓటు హక్కు సద్వినియోగం చేసుకున్నారు. అనంతరం సెల్ఫీపాయింట్ వద్ద ఫొటోలు దిగారు. అలాగే శిక్షణ సహాయ కలెక్టర్ వికాస్ మహతో ఉన్నారు. అనంతరం పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతా చర్యలను పర్యవేక్షించి, సిబ్బందికి సూచనలు చేశారు.
వంద శాతం పోలింగ్ నమోదే లక్ష్యంగా ఎన్నికల సంఘం పలు వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. విస్తృత అవగాహన కల్పించడంతో పాటు పలు కేంద్రాలను ఆదర్శ కేంద్రాలుగా ఎంపిక చేసింది. ఆదిలాబాద్, బోథ్ రెండు నియోజకవర్గాల్లో 20కిపైగా ఆదర్శ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఓటు వేసి సెల్ఫీలు దిగేందుకు వీలుగా సెల్ఫీపాయింట్లను సైతం ఏర్పాటు చేశారు. తల్లితండ్రులతో పాటు వచ్చిన చిన్నారులు ఆడుకునేందుకు వీలుగా ఆట వస్తువులను అందుబాటులో ఉంచారు. అలాగే ఆయా పోలింగ్ కేంద్రాల్లో వృద్ధులు, దివ్యాంగుల కోసం సైతం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. కేంద్రాలకు వచ్చిన వృద్ధులకు పోలీసులతో పాటు వలంటీర్లు సహకారం అందించారు. దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా వీల్చైర్స్ అందుబాలులో ఉంచారు.
సోన్, నవంబర్ 30 : నిర్మల్ మండలం ఎల్లపెల్లి ప్రాథమిక పాఠశాలలో నియోజకవర్గ అభ్యర్థి, మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తమ ఓటు హ క్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటుకుకు ఉన్న ప్రాధాన్యత తెలుసుకొని, ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఆయన వెంట సర్పంచ్ అల్లోల రవీందర్రెడ్డి, నాయకులు అల్లోల మురళీధర్రెడ్డి, అల్లోల గౌతంరెడ్డి, అల్లోల సురేందర్రెడ్డి, సంపత్రెడ్డి తదితరులున్నారు.
నేరడిగొండ, నవంబర్ 30 : బోథ్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జాదవ్ అనిల్ కుటుంబ సభ్యులతో కలిసి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మండలంలోని రాజురా లో ఉదయం మొట్టమొదటి ఓటు జాదవ్ అనిల్ వేశారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని నియోజకవర్గ ప్రజలను కోరారు.
భైంసాటౌన్, నవంబర్ 30 : ముథోల్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే విఠల్ రెడ్డి త న స్వగ్రామమైన దేగాం ప్రభుత్వం పాఠశాల 167 బూత్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. నియోజకవర్గ పరిధిలోని ఓటు హక్కు కలిగిన ప్రజలందరూ తమ విలువైన ఓటును సకాలంలో వెళ్లి, వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఖానాపూర్ టౌన్, నవంబర్ 30 : ఖానాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి భూక్యా జాన్సన్ నాయక్ పట్టణంలోని శాంతినగర్ ఒడ్డెవాడ పాఠశాలలోని 237 పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అంతకుముందు స్థానిక హనుమాన్ ఆలయంలో స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని, ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధమని పేర్కొన్నారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, ఏపీపీఎస్సీ మాజీ సభ్యులు పైడిపెల్లి రవీందర్రావు దంపతులు, మున్సిపల్ చైర్మన్ అంకం రాజేందర్ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.