ఆర్టీసీ.. తమ ఉద్యోగులు, సిబ్బంది ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టిపెట్టింది. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాలంటే వారంతా ఆరోగ్యంగా ఉండాలని భావిస్తున్నది. అందుకోసం టీఎస్ ఆర్టీసీ గ్రాండ్ హెల్త్ చాలెంజ్ కార్యక్రమంలో భాగంగా సంస్థలోని డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్లు, సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నది. ఉమ్మడి జిల్లాలోని ఆరు డిపోల్లో 2,828 మందికి 17 రకాల వైద్య పరీక్షలు చేయిస్తున్నది. కాగా, ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటికే ప్రారంభించింది.
– నిర్మల్ అర్బన్, నవంబర్ 17
ఉమ్మడి జిల్లాలో మొత్తం ఆరు డిపోలు (ఆదిలాబాద్, నిర్మల్, భైంసా, మంచిర్యాల, ఉట్నూర్, ఆసిఫాబాద్) ఉన్నాయి. 2,828 మంది సిబ్బంది ఉన్నారు. అందులో ఆర్టీసీ ఉద్యోగులు 2,360 మంది ఉండగా, అద్దె బస్సు డ్రైవర్లు 468 మంది ఉన్నారు. మంచిర్యాల డిపోలో అత్యధికంగా 559 మంది ఉండగా, నిర్మల్లో అత్యధికంగా 134 మంది అద్దె బస్సు డ్రైవర్లు ఉన్నారు.
30 వరకు ఆరోగ్య పరీక్షలు..
ఉమ్మడి జిల్లాలోని మొత్తం ఆరు డిపోల్లోని ఆర్టీసీ సిబ్బందికి ఈ నెల 13వ తేదీ నుంచి ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్ డిపోలో ఆర్టీసీ ఉద్యోగులు, అద్దె బస్సు డ్రైవర్లకు ఆరోగ్య పరీక్షలను నిర్వహిస్తున్నది. మిగతా డిపోల్లో ఈ నెల 30వ తేదీ వరకు పరీక్షలను చేయనున్నది. ఇందులో సిబ్బందితో సహా అందరికీ బీపీ, షుగర్, కంటి పరీక్షలు, ఈసీజీతో పాటు 17 రకాల వైద్య పరీక్షలు చేయిస్తున్నది.
అందరి సంక్షేమం కోసమే..
ఉద్యోగులు, సిబ్బంది ఆరోగ్యంగా ఉంటేనే ప్రయాణికులు సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకుంటారని సంస్థ భావిస్తున్నది. నిత్యం పని ఒత్తిడిలో ఉండడంతో ఆరోగ్యంపై శ్రద్ధ తగ్గిపొయే అవకాశాలున్న నేపథ్యంలో డ్రైవర్లు, కండక్టర్లు, సిబ్బంది, చివరకు ప్రైవేటు బస్సు డ్రైవర్లకు కూడా పరీక్షలు నిర్వహిస్తున్నది. అందుకోసం డిపోల వారీగా కనిష్ఠంగా రెండు రోజుల నుంచి సిబ్బంది సంఖ్యను దృష్టిలో పెట్టుకొని వారం పాటు వైద్య పరీక్షలు చేయిస్తున్నది. దీంతో ప్రాథమిక దశలోనే డ్రైవర్లు, సిబ్బంది ఆరోగ్య వివరాలను తెలుసుకునే అవకాశం ఉంది.
సద్వినియోగం చేసుకోవాలి..
టీఎస్ ఆర్టీసీ గ్రాండ్ హెల్త్ చాలెంజ్ కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి జిల్లాలోని ఆరు డిపోల పరిధిలో ఆర్టీసీ సిబ్బంది, ఉద్యోగులు, డ్రైవర్లు, కండక్టర్లకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నాం. ఈ నెల 13వ తేదీ నుంచి 30వ తేదీ వరకు కార్యక్రమం కొనసాగుతుంది. ఆయా డిపోల్లో పని చేస్తున్న ప్రతి ఒక్కరూ ఈ వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి.
– సుదాపరిమళ, ఆర్ఎం, ఆదిలాబాద్