కుమ్రం భీం ఆసిఫాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు పేరును ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఖరారు చేశారు. గురువారం ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు కేసీఆర్ను కలిశారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థిగా ఆత్రం సక్కును ఆయన ప్రకటించారు. తిర్యాణి మండలం గిన్నెధరి గ్రామ పరిధిలోగల లక్ష్మీపూర్కు చెందిన ఆత్రం సక్కు 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి మొదటిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో కాంగ్రెస్ నుంచి పోటీచేసి బీఆర్ఎస్ అభ్యర్థి కోవ లక్ష్మి చేతిలో ఓడిపోయారు. 2018లో కాంగ్రెస్ నుంచి పోటీచేసి ఎమ్మెల్యేగా రెండోసారి ఎన్నికయ్యారు. ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆదిలాబాద్ ఎంపీగా అవకాశం కల్పిస్తామని కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు 2024 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోకి వచ్చే ఏడు నియోజకవర్గాల్లో ఆదివాసీ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు అధికంగా ఉండడం, ఇప్పటికి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలువడం.. గిరిజనుల్లో మంచి పేరు ఉండడంతో అధిష్టానం ఆత్రం సక్కు పేరును ఖరారు చేసినట్లు తెలిసింది.