దండేపల్లి, జనవరి 29 :మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని గూడెం శ్రీ సత్యనారాయణ స్వామి బ్రహ్మోత్సవాలకు వేళయ్యింది. నేటి నుంచి వేడుకలు ప్రారంభం కానుండగా, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశముంది. దేవస్థాన ఈవో సంకటాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.
ఫిబ్రవరి 2న గోధూళిక సుముహూర్తాన సత్యనారాయణస్వామి కల్యాణం, 5న మాఘశుద్ధ పౌర్ణమిన జాతర నిర్వహించనున్నారు. ఈ నెల 30 నుంచి వచ్చే ఒకటో తేదీ వరకు ఆలయంలో నిత్యవిధి, ప్రాభోదిక ఆరగింపు, తీర్థ ప్రసాద గోష్ఠి, విశ్వక్సేనారాధన, దీక్ష కంకణాధారన, నిరంతర సప్తాహ భజనలు, 2న నిత్యవిధి, ప్రాభోదిక ఆరగింపు, తీర్థ ప్రసాద గోష్ఠి, వాసుదేవ పుణ్యహహచనము, విశ్వక్సేనారాధన, రుత్విగ్వరణమ్, అంకురార్పరణం, పటాధివాసమం, ధ్వజారోహణం, సాయంత్రం 5 గంటలకు గోధూళిక సుముహూర్తమున స్వామి వారి కల్యాణ మహోత్సవం, 3న నిత్యవిధి, ప్రాభోదిక ఆరగింపు, తీర్థ ప్రసాదగోష్ఠి, హవనం, స్థాళీపాక, పంచసూక్త హోమములు, బలిహరణము, నిత్య హోమములు, 4న నిత్యవిధి, ప్రాభోదిక ఆరగింపు, తీర్థ ప్రసాదగోష్ఠి, నవగ్రహ హోమం, పంచసూక్త హోమమములు, బలి హరణము, నిత్యహోమములు, 5న నిత్యవిధి, ప్రాభోదిక ఆరగింపు, తీర్థ ప్రసాదగోష్ఠి, హవనం, నిత్యహోమములు, జయాదిహోమం, శాంతి హోమం, మహాపూర్ణాహుతి, బలిహరణం, సాయంత్రం 6 గంటలకు స్వామి వారి సేవా ఉత్సవం, 6న స్వామివారి రథోత్సవం, సప్తాహ భజన, పరిసమాప్తం, ఏకాంత సేవతో స్వామి వారి బ్రహ్మోత్సవ వేడుకలు ముగుస్తాయని ఆలయ ఈవో తెలిపారు.
స్వామి వారి కల్యాణం సందర్భంగా ప్ర ధాన ఆలయానికి రంగులు వేసి ముస్తాబు చేశారు. సత్యనారాయణస్వామి, ఆంజనేయస్వామి దేవాలయాలను రంగు రంగుల వి ద్యుద్దీపాలతో అలంకరిస్తున్నారు. స్వామి వా రి కల్యాణం కోసం భక్తులు రూ.500 రుసుం చెల్లించి రసీదు పొందాలని ఆలయాధికారులు తెలిపారు. స్వామి వారి కల్యాణాన్ని వీక్షించేందుకు ఎల్ఈడీ తెరలను ఏర్పాటు చేయనున్నారు. స్వామి వారి కల్యాణ మహోత్సవానికి ఎంపీ వెంకటేశ్ నేతకాని, ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు హాజరుకానున్నారు.
బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేశాం. ఈ నెల 30 నుంచి జరుగనున్న కల్యాణానికి ఉమ్మడి జిల్లా నుండేగాక ఇతర జిల్లాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. కల్యాణం అనంతరం అన్నదానం చేస్తాం. ఎంపీ, ఎమ్మెల్యే కల్యాణ మహోత్సవానికి హాజరు కానున్నారు.
– సంకటాల శ్రీనివాస్, ఈవో, గూడెం దేవస్థానం