ఆసిఫాబాద్/మంచిర్యాల అర్బన్, జూన్ 11 ;ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదివారం గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. అభ్యర్థులను గంట ముందు నుంచే కేంద్రాల్లోకి అనుమతించగా, సిబ్బంది ‘నిమిషం నిబంధన’ను అమలు చేసింది. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎగ్జామ్ కొనసాగింది. ఆయాచోట్ల 144 సెక్షన్ విధించగా, ఉన్నతాధికారులు పర్యవేక్షించారు.
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లా కేంద్రాల్లో ఆదివారం నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ ప్రశాంతంగా ముగిసింది. పరీక్షా కేంద్రాలను ఎస్పీలు డీ ఉదయ్ కుమార్ రెడ్డి, సీహెచ్ ప్రవీణ్కుమార్ పరిశీలించారు. పరీక్షకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అభ్యర్థుల కోసం అన్ని సౌకర్యాలు కల్పించారు. కాగా, ఆదిలాబాద్లో 19 కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 6,190 అభ్యర్థులకు గాను 4,440 మంది పరీక్ష రాశారు. 1,750 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేశారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. పరీక్ష విజయవంతంగా పూర్తి కావడంలో బందోబస్తులో పాల్గొన్న ప్రతి ఒక్క పోలీస్ అధికారికి ఎస్పీ అభినందనలు తెలిపారు. ఆయన వెంట అదనపు ఎస్పీలు శ్రీనివాసరావు, సమయ్ జాన్రావు, డీఎస్పీలు వీ ఉమేందర్, పోతారం శ్రీనివాస్, సిబ్బంది తదితరులున్నారు.
నిర్మల్ జిల్లా కేంద్రంలో..
నిర్మల్ జిల్లాలో నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. నిర్మల్ జిల్లా కేంద్రంలో 14 పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల్లో మొత్తం 4,489 మందికి 3,042 మంది అభ్యర్థులు హాజరయ్యారు. 1,447 మంది గైర్హాజరయ్యారు. పరీక్షను పటిష్టంగా నిర్వహించేందుకు 14 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, నలుగురు రూట్ ఆఫీసర్లు, 14 మంది లైజన్ అధికారులు, 198 మంది ఇన్విజిలేటర్లు విధుల్లో పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు 144 సెక్షన్ అమలు చేశారు. నిమిషం నిబంధన అమలులో ఉండడంతో పరీక్ష సమయానికి 15 నిమిషాలు ముందుగానే గేట్లు మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించగా, అభ్యర్థులు ముందుగానే సెంటర్లకు చేరుకున్నారు. అభ్యర్థుల గుర్తింపు కార్డుల ఆధారంగా పరీక్షా కేంద్రం లోపలికి అనుమతించారు. పరీక్షకు ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించలేదు. ముందు జాగ్రత్తగా పోలీసులు మెటల్ డిటెక్టర్తో తనిఖీలు నిర్వహించారు. పరీక్షా కేంద్రాలను ఎస్పీ ప్రవీణ్కుమార్ తనిఖీ చేసి భద్రతను పర్యవేక్షించారు.