ఆదిలాబాద్ : ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ రైతులకు ఎంతో ప్రయోజనకరంగా ఉందని రాష్ట్ర అటవీ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.గురువారం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ అధ్యక్షతన దాదాపు ఆరుగంటల పాటు కొనసాగింది. ఆదిలాబాద్, బోథ్ ఎమ్మెల్యేలు జోగు రామన్న, రాథోడ్ బాపురావు, ఎమ్మెల్సీ జీవన్రెడ్డి, కలెక్టర్ సిక్త పట్నాయక్, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి భావేశ్ మిశ్రా, డీసీసీబీ చైర్మన్ రఘునందన్రెడ్డి, జడ్పీటీసీలు, ఎంపీపీలు, వివిధ శాఖ అధికారులు హాజరయ్యారు. విద్యాశాఖ, మిషన్ భగీరథ, రహదారులు భవనాలు, పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్, గిరిజన సంక్షేమం, వైద్యం ఆరోగ్యం, వ్యవసాయం, మార్కెటింగ్, మార్క్ఫెడ్, పరిశ్రమలు తదితర శాఖలపై సభ్యులు చర్చించారు.
తమ ప్రాంతాల్లోని వివిధ శాఖల ఆధ్వర్యంలో చేపడుతున్న అభివృద్ధి పనుల వివరాలు, పనుల్లో జాప్యం, ఇతర సమస్యలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు అధికారులు సమాధానం చెప్పారు.ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ..గతంలో భూముల అమ్మకాలు, కొనుగోళ్లు,మ్యుటేషన్ కోసం రైతుల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చేదని అన్నారు. ధరణీ అమల్లోకి వచ్చిన తర్వాత 40 నిమిషాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుందని, ఈ ప్రక్రియలో ఎలాంటి అవినీతికి అవకాశం లేదని పేర్కొన్నారు.
ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని పోడు భూముల వివరాలను సేకరించాలని మంత్రి అధికారులకు సూచించారు. ఎమ్మెల్యేలుకు ఇచ్చే నిధుల నుంచి రూ.2 కోట్లను పాఠశాలల అభివృద్ధికి కేటాయిస్తుందని తెలిపారు. ఎమ్మెల్యే జోగు రామన్న మాట్లాడుతూ..కిసాన్ సమ్మాన్ పథకాన్ని అర్హులైన వారందరికీ వర్తింపచేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ..మిషన్ భగీరథ పథకం ద్వారా ప్రతి గ్రామానికి మంచినీరు అందిస్తున్నామని, ఈ పథకం వల్ల పల్లెల్లో తాగునీటి సమస్య లేకుండా పోయిందని వెల్లడించారు.