సర్కారు బడుల్లో చదివే నిరుపేద విద్యార్థుల కడుపునింపే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ‘సీఎం బ్రేక్ ఫాస్ట్’ వేగంగా అమల్లోకి వచ్చింది. ఇప్పటికే అన్నిచోట్ల రుచికరమైన మధ్యాహ్న భోజనం పెడుతుండగా, తాజాగా.. అన్ని రకాల పోషకాలతో కూడిన అల్పాహారం అందిస్తున్నది. ఇచ్చిన మాట ప్రకారం దసరా కానుకగా అన్ని పాఠశాలల్లో ఈ పథకం ప్రారంభించగా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 2.56 లక్షల మందికి ప్రయోజనం చేకూరనున్నది. ఎయిడెడ్, మోడల్ స్కూళ్లతో పాటు మదర్సాల్లోనూ దీనిని వర్తింపజేయనుండగా, సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
– మంచిర్యాల, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
మంచిర్యాల, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద, మధ్యతరగతి పిల్లల కోసం తెలంగాణ సర్కారు ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సీఎం బ్రేక్ఫాస్ట్ కార్యక్రమం.. గురువారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మరిన్ని బడుల్లో అమల్లోకి వచ్చింది. దసరా కానుకగా ఈ కార్యక్రమం అమలు చేస్తామని గతంలోనే ప్రకటించిన విధంగానే వేగంగా అమల్లోకి తీసుకొచ్చారు. ఇప్పటికే విద్యార్థులకు అవసరమైన పుస్తకాలు, నోట్బుక్స్, యూనిఫామ్స్ ఉచితంగా ఇవ్వడంతో పాటు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నారు. సన్న బియ్యంతో భోజనం, రాగి జావ, కోడి గుడ్డు-అరటి పండు, స్పెషల్ క్లాస్లకు వచ్చే పదో తరగతి విద్యార్థులకు స్నాక్స్ ఇస్తున్నారు.
వీటితో పాటు ఇప్పుడు బ్రేక్ ఫాస్ట్ కూడా పెడుతున్నారు. ప్రభుత్వ బడుల్లో చదివే పిల్లలతో పాటు ఎయిడెడ్ పాఠశాలలు, ఆదర్శ పాఠశాలలు, మదర్సాల్లో చదివే పిల్లలకు సైతం దీన్ని వర్తింపజేస్తున్నారు. ఉదయాన్నే హడావుడిగా బడికి వచ్చే విద్యార్థుల ఆకలి బాధలు తీర్చాలన్న సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని తీసుకువచ్చారు. పిల్లలకు అన్ని రకాల పోషకాలు అందించే లక్ష్యంతో వారంలో ఆరు రోజులకు ప్రత్యేక మెనూను సిద్ధం చేశారు. ఉప్మా, కిచిడీ, పొంగల్తో పాటు వారంలో ఒక రోజు మిల్లెట్స్ ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.
ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల లాంటి మా రుమూల జిల్లాల్లో విద్యార్థుల గైర్హాజరును తగ్గించేందుకు, డ్రాపౌట్స్కు అడ్డుకట్ట వేసేందుకు ఈ పథకం ఉపయోగపడుతుందని విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అంటున్నారు. ఉ మ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 3,637 ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 2.56 లక్షల మంది విద్యార్థులకు ఇది వర్తించనున్నది. వీరితో పాటు 18 ఎయిడెడ్, 14మోడల్ స్కూల్స్లో చదివే 11, 472 మంది విద్యార్థులకు, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని 5 మదర్సాల్లో ఉన్న 92 మంది విద్యార్థులకు సైతం బ్రేక్ఫాస్ట్ అందిస్తున్నారు.
మంచిర్యాల జిల్లాలోని అన్ని సర్కార్ బడుల్లో సీఎం బ్రేక్ఫాస్ట్ అమలు చేస్తాం. ప్రయోగాత్మకంగా తొలిసారి నియోజకవర్గానికి ఒక స్కూల్లో పెట్టాం. అది విజయవంతమైంది. ఈ రోజు మండలానికి రెండు స్కూళ్ల చొప్పున ప్రారంభించినం. ఇలా ప్రతివారం రెండు, రెండు స్కూళ్లు పెంచుకుంటూ పోతాం. అన్ని పాఠశాలల్లో అమలు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి మంచి స్పందన వస్తున్నది. సర్కార్ బడుల్లో విద్యార్థుల గైర్హాజరును తగ్గించేందుకు, డ్రాపౌట్స్ తగ్గించేందుకు ఇది ఎంతగానో దోహదం చేస్తది.
– యాదయ్య, డీఈవో, మంచిర్యాల