ఏప్రిల్ – 578
మే – 582
జూన్ – 564
జూలై – 3,083
ప్రభుత్వ వైద్యరంగం కొత్త పుంతలు తొక్కుతున్నది. సాంకేతికత తోడుగా నవీకరణ వైపు అడుగులు వేస్తున్నది. ఇందుకు నిదర్శనమే టెలీ మెడిసిన్. కరోనా విపత్కర పరిస్థితుల్లో అందుబాటులోకి వచ్చిన టెలీమెడిసిన్ సేవలు గ్రామీణ ప్రాంతాల వారికి వరంగా మారాయి. ప్రస్తుతం ఎలాంటి వ్యాధికైనా మండల కేంద్రాల్లోని పీహెచ్సీ వేదికగా మెరుగైన చికిత్స అందుతున్నది. మారుమూల ప్రాంతాల్లోని ప్రజలు కూడా హైద్రాబాద్లోని వైద్యుడితో నేరుగా మాట్లాడి, వైద్య సాయం పొందే వీలు కలుగుతున్నది. నిర్మల్ జిల్లాలో గత నాలుగు నెలల్లోనే 4,807 మంది ఈ సేవలను వినియోగించుకున్నట్లుగా అధికార యంత్రాగం చెబుతున్నది.
నిర్మల్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ దవాఖానలు పేద రోగులకు భరోసా కలిగిస్తున్నాయి. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూ మెరుగైన వైద్య సేవలు, ప్రత్యేక వైద్య నిపుణుల సేవలను ‘టెలీ వైద్య’ విధానంలో ఉచితంగానే అందిస్తున్నాయి. జిల్లా, ప్రాంతీయ దవాఖానలు మొదలుకొని మండల స్థాయిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు 3జీ ఇంటర్నెట్ పరిజ్ఞానంతో అనుసంధానం చేయడం ద్వారా 21 రకాల ప్రత్యేక నిపుణుల సేవలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో స్పెషలిస్ట్, సూపర్ స్పెషలిస్ట్ వైద్యుల సేవల కోసం దూరప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం రోగులకు తప్పింది. వైద్యుల ఫీజులతోపాటు రాకపోకలు, ఆహారం, రోజువారీ ఉపాధి నష్టం, వెంట వచ్చేవారి వ్యయంతో కలిపి పెద్ద మొత్తంగా రోగులకు ఆదా అయినట్లు వైద్యవర్గాలు చెబుతున్నాయి. టాటా ట్రస్టు సాంకేతిక సహకారంతో నిర్వహిస్తున్న టెలీవైద్య సేవలు జిల్లాలో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి 23 పీహెచ్సీల్లో అందుబాటులోకి వచ్చాయి.
నాలుగు నెలల్లో 4,807 మందికి సేవలు
జిల్లాలో టెలీ వైద్య సేవలు మొదలైన ఏప్రిల్ నెల నుంచి గడిచిన నాలుగు నెలల కాలంలో 4,807 మంది గ్రామీణ ప్రాంత రోగులు ఈ సేవలను వినియోగించుకున్నారు. గైనకాలజీ, డెర్మటాలజీ, ఈఎన్టీ, జనరల్ మెడిసిన్, పీడియాట్రిక్, జనరల్ సర్జన్ తదితర విభాగాలకు చెందిన నిపుణులు నిర్దేశించిన రోజుల్లో టెలీ వైద్యసేవలను అందించేందుకు అందుబాటులో ఉంటారు. ఆయా విభాగాల్లో వైద్య నిపుణుల సేవలు పొందాలంటే ఆ రోజుల్లో మాత్రమే పీహెచ్సీలకు వెళ్లాల్సి ఉంటుంది. పీహెచ్సీల్లో ఉండే కంప్యూటర్(వీడియో కాలింగ్) సాయంతో నేరుగా సంబంధిత వైద్య నిపుణుడితో మాట్లాడిస్తున్నారు. ఈ మేరకు పీహెచ్సీలకు టీవీ, హెడ్సెట్, కెమెరా, మైక్రోఫోన్, నెట్ సదుపాయం కల్పించారు. కొన్ని సందర్భాల్లో అవసరమైతే ఉస్మానియా, నిమ్స్ దవాఖానల నిపుణులతోనూ మాట్లాడిస్తున్నారు. కంప్యూటర్ తెరపై స్పెషలిస్ట్ వైద్యుడిని రోగులు నేరుగా చూసే అవకాశముంటుంది. స్పెషలిస్ట్ వైద్యుడు కూడా రోగిని వీడియో ద్వారా చూడొచ్చు. పరీక్షా ఫలితాలను ఆన్లైన్లో పరిశీలించి చికిత్సను సూచిస్తారు. రక్త, మూత్ర, ఎక్స్రే, సిటీ స్కాన్ వంటి పరీక్షల నివేదికలను స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ వైద్యులకు డిజిటల్ రూపంలో పంపిచడం ద్వారా..వ్యాధిని కచ్చితంగా నిర్ధ్దారించేందుకు అవకాశం కలుగుతోంది. టెలీ వైద్య సేవలను పొందిన వారిలో ఎక్కువగా మహిళలే ఉంటున్నారు.
టెలీ మెడిసిన్తో రోగులకు సాంత్వన
జాతీయ ఆరోగ్య సర్వే 2021 ప్రకారం.. రాష్ట్రంలో స్పెషలిస్ట్ వైద్యం కోసం ఒక్కో రోగి ఒకసారి కన్సల్టేషన్కు సగటున రూ.980 సొంతంగా ఖర్చు చేస్తున్నారు. దీనికి ప్రయాణం, భోజన ఖర్చులు కూడా కలిపితే రూ.1,119 అవుతుందని అంచనా. ఈ లెక్క ప్రకారం..గత నాలుగు నెలల కాలంలో జిల్లా ప్రజానీకానికి పెద్ద మొత్తంలో డబ్బులు ఆదా అయినట్లు వైద్యవర్గాలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా ఫిజియోథెరపీకి ప్రైవేట్లో ఒక్కో విజిట్కు రూ.800 నుంచి రూ.వెయ్యి వరకు తీసుకుంటుండగా..టెలీవైద్యంలో ఉచితంగానే సేవలు అందుతున్నాయి. వైద్య నిపుణులు ఈ.ప్రిస్క్రిప్షన్ ఆన్లైన్లో జారీ చేస్తుండగా పీహెచ్సీల్లోనే రోగులకు అక్కడి వైద్యులు అందజేస్తున్నారు. ఇది నిరుపేద రోగులకు గొప్ప సాంత్వన కల్గిస్తున్నది.
రోగులకు సత్వర వైద్య సేవలు
నిర్మల్ చైన్గేట్, ఆగస్టు, 23: టెలీమెడ్సిన్ ద్వారా రోగులకు సత్వర వైద్య సేవలు అందుతాయి. వైద్యుడు రోగిని వీడియో ద్వారా చూడడంతో పాటు రక్త, మూత్ర, ఎక్స్రే, సీటీ స్కాన్ వంటి పరీక్షల రిపోర్టులను చూసి స్పెషాలిటీ వైద్యులతో వ్యాధిని నిర్ధారించి చికిత్స అందించే ఆస్కారం ఉంది. నిపుణులైన వైద్యులతో టెలీమెడిసిన్ ద్వారా వైద్య సలహాలు అందజేస్తున్నాం. సూపర్ స్పెషాలిటీ వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం రోగులకు తప్పింది. వైద్య సేవలకు వచ్చే వారికి ఫీజులతో పాటు రాకపోకలకు ఖర్చులు తగ్గాయి. ఈ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలి. -డా. ధన్రాజ్, నిర్మల్ జిల్లా వైద్యాధికారి