ఆదిలాబాద్ రూరల్, డిసెంబర్ 23: కూతురిని ప్రేమించాడనే కోపంతో ప్రేమ ఓ తండ్రి కిరాయి హంతకులతో యువకుడిపై హత్యాయత్నం చేయించిన ఘటన ఆదిలాబాద్ జిల్లా మావల మండలకేంద్రంలో సంచలనం సృష్టించింది. కాగా, ఈ కేసును జిల్లా పోలీసులు ఛేదించారు. స్థానిక మావల పోలీస్ స్టేషన్లో ఆదిలాబాద్ డీఎస్పీ వీ ఉమేందర్ సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. ఆదిలాబాద్ పట్టణంలోని దుర్గానగర్ కాలనీ కౌన్సిలర్ రఘుపతి కూతురు ఎస్సీ కులానికి చెందిన వంశీ అనే యువకుడితో ప్రేమలో పడింది. అయితే తొలుత రెండేళ్ల క్రితం వంశీని ఫామ్ హౌస్కు తీసుకెళ్లి రఘుపతి బెదిరించాడు. ఆ తర్వాత కూడా వంశీలో మార్పు రాకపోవడంతో, చంపాలని నిర్ణయించకున్నాడు. ఈ క్రమంలో కేఆర్కే కాలనీకి చెందిన చౌహాన్ రవి, అతడి మిత్రుడు అశోక్ను కలిసి రూ.15 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ప్లాన్లో భాగంగా జీపుతో గుద్దితే యాక్సిడెంట్ కేసుగా నమోదవుతుందని, అనుమానం రాదని భావించారు.
ఒప్పందం మేరకు రవికి రూ.లక్ష అడ్వాన్స్ రఘుపతి ఇచ్చాడు. రఘుపతి భార్య అరుంధతి కూడా ఇందులో పాలుపంచుకుంది. వంశీ ఇల్లును రవికి చూపించారు. ఇక వంశీని చంపేందుకు పలుమార్లు రెక్కీ కూడా నిర్వహించారు. ఈ క్రమంలో ఈ నెల 18న శ్మశాన వాటిక దగ్గరలో వంశీ స్కూటీని బలంగా ఢీకొట్టారు. మళ్లీ రివర్స్ తీసుకొని వెళ్లే క్రమంలో జీపు స్తంభానికి ఢీకొంది. దీంతో వారు అక్కడి నుంచి పారిపోయారు. తదుపరి వంశీ తండ్రి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి, పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రూ. 50 వేలకు జీపు సమకూర్చిన రాజు, దిల్షాద్తో పాటు నిందితులు అశోక్, రవిలను అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి సుమారు రూ.18,500 నగదు, నాలుగు మొబైల్ ఫోన్లు, రెండు మోటార్ సైకిళ్లు, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం మావల కౌన్సిలర్ రఘుపతి, అతడి భార్య అరుంధతి పరారీలో ఉన్నారు. కాగా రఘుపతి బీజేపీకి చెందిన కౌన్సిలర్ గా కొనసాగుతున్నారు.