మంచిర్యాల (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/చెన్నూర్, ఫిబ్రవరి 9 : భారత మాజీ ప్రధాని స్వర్గీయ పీవీ నర్సింహారావు భారత జాతి ఖ్యాతిని ప్రపంచదేశాలకు చాటిచెప్పారు. రుక్మాబాయమ్మ, సీతారామారావు దంపతులకు 28.06.1921లో జన్మించా రు. ఈయన భార్య సత్తెమ్మ. వీరికి ముగ్గురు కొడుకులు, ఐదుగురు కూతుళ్లు. వరంగల్ జిల్లా వేలేరు మండల కేంద్రంలోని ప్రభు త్వ పాఠశాలలో విద్యాభ్యాసం మొదలు పెట్టారు.
హన్మకొండలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మెట్రిక్యులేషన్ పూర్తిచేశారు. కళాశాల చదువుకోసం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చేరారు. అక్కడ వందేమాతరం ఆలపించడంతో సహచరులతోపాటు పీవీని విశ్వవిద్యాలయం నుంచి అప్పటి నిజాం ప్రభుత్వం బహిష్కరించింది. దీంతో మహారాష్ట్రలోని నాగపూర్లో ఉన్నత విద్యాభ్యాసం కొనసాగించారు. బీఎస్సీ, ఎల్ఎల్బీ పూర్తిచేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరి అంచెలంచెలుగా అఖిలభారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడయ్యారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, భారత ప్రధానిగా క్లిష్టసమయాల్లో బాధ్యతలు స్వీకరించారు. ముల్కీనిబంధనలు చట్టవిరుద్ధమని చెప్పిన సుప్రీంకోర్టు తీర్పును బహిరంగంగా స్వాగతించినందుకు అప్పటి సీమాంధ్రనేతలు కక్షగట్టారు. భూసంస్కరణల చట్టం అమలుకు ఏకంగా ఆర్డినెన్స్ తీసుకురావడం తెలంగాణ-ఆంధ్రానేతలకు కంఠగింపుగా మారింది. ఫలితంగా పీవీ ముఖ్యమంత్రిగా పదవీచ్యుతడయ్యారు. ప్రధానిగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన భారతదేశాన్ని తన శక్తియుక్తులతో గట్టెక్కించారు. 1996లో ప్రధానమంత్రి పదవీకాలం ముగిశాక పీవీ క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు.
పీవీ 2004 డిసెంబర్ 23న 83వ యేట మరణించారు. మరణానంతరం ఆయనను స్మరించుకోవడంలో కాంగ్రెస్ పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. జయంతి, వర్ధంతి రోజుల్లో కూడా ఇదే వివక్ష చూ పారు. గల్లీ లీడర్లకు సైతం విగ్రహాలు పెట్టే నేతలు పీవీ విషయంలో మాత్రం స్పందించలేదు. కనీసం విగ్రహాలు కూడా ఆవిష్కరించుకోలేదు. కానీ, 2014లో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పీవీకి తగిన గుర్తింపునిచ్చింది. కేసీఆర్ ఆదేశాల మేరకు ఆయన జయంతి వేడుకలను ఏటా అధికారికంగా నిర్వహిస్తూ వచ్చారు.
పీవీ నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్నను ప్రకటించింది. తెలుగుబిడ్డ పీవీకి దేశంలోని అత్యున్నతమైన పురస్కా రం ప్రకటించడంపై ఉమ్మడి జిల్లా ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. భారత ప్రధానిగా తెలంగాణ ఖ్యాతిని ఖండాంతరాలకు చాటి చెప్పిన మహా మేధావి.. మన పీవీ అని కొనియాడుతున్నారు.
కేంద్రానికి కృతజ్ఞతలు
భారత మాజీ ప్రధాన మంత్రి పీవీ నర్సింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారత రత్న ప్రకటించినందుకు చాలా సంతోషంగా ఉంది. పీవీ భారత ప్రధానిగా అనేక సంస్కరణలు చేట్టారు. తెలంగాణ ఖ్యాతిని ఖండాంతరాలకు చాటి చెప్పిన మహా మేధావి. పీవీకి భారత రత్న ప్రకటించిన కేంద్ర ప్రభుత్వానికి ఆయన కృతజతలు తెలుపుకుంటున్న. – బాల్క సుమన్, చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే