నిర్మల్ అర్బన్, జనవరి 2: వందేళ్లు గడపాల్సిన జీవితాలను కాదనుకొని క్షణికావేశంలో కొందరు అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. ఇంటికి పెద్ద దిక్కు గా నిలవాల్సిన తండ్రి, తోడుగా నిలవాల్సిన కొడుకు.. బిడ్డలకు అండగా నిలవాల్సి తల్లిదండ్రులు, అన్నదమ్ముళ్లు, అక్కా చెల్లెల్లు ఇలా ఒకరికొకరు తోడుగా నిలవాల్సిన వారు బలవన్మరణాలతో అంతులేని క్షోభను మిగులుస్తున్నారు. చిన్న చిన్న కారణాలతో తనువులు చాలిస్తూ కుటుంబాలను రోడ్డున పడేస్తున్నారు. ఒక్కోసారి కుటుంబ పెద్ద మరణంతో బతుకులు అగమ్యగోచరంగా మారుతున్నాయి.. జిల్లాలో ఆత్మహత్యలపై ‘నమస్తే తెలంగాణ’ అందిస్తున్న కథనం.
ఈ ఏడాది 244 మంది ఆత్మహత్య..
నిర్మల్ జిల్లాలోని 19 మండలాల్లో 2023 సంవత్సరంలో డిసెంబర్ నెల వరకు 244 మంది ఆత్మహ త్య చేసుకున్నారు. జిల్లాలో గత ఐదేళ్ల నుంచి ఆత్మహత్యల నివేదికను పరిశీలిస్తే, ఏటా వీటి సంఖ్య పెరుగుతూనే ఉంది. 2019వ సంత్సరంలో 138 మంది, 2020లో 175. 2021లో 252, 2022 లో 239 మంది ఆత్మహత్య చేసుకున్నారు. 2023 లో మళ్లీ వీటి సంఖ్య 244కి పెరిగింది. ఏటా జిల్లా లో ఆత్మహత్యల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతూ నే ఉందని గణాంకాలు చెబుతున్నాయి. బలమైన కారణాలు లేనప్పటికీ క్షణికావేశంలో బలవన్మరణానికి పాల్పడుతున్నారు.
వీధిన పడుతున్న కుటుంబాలు..
కుటుంబ పెద్దల మరణాలతో వారిపైనే ఆధారపడిన కుటుంబాలు వీధిన పడుతున్నాయి. సమస్యను పరిష్కరించుకునే అవకాశం ఉన్నప్పటికీ వాటన్నింటినీ లెక్క చేయకుండా కేవలం చావుతోనే సమస్యకు పరిష్కారమని అపోహ పడుతున్నారు.
కౌన్సెలింగ్ ఎంతో మేలు..
ఆత్మహత్యలకు గల కారణాలను కౌన్సెలింగ్తో సులువుగా పరిష్కరించుకోవచ్చని మానసిక నిపుణులు చెబుతున్నారు. ఒక బలమైన సమస్య వచ్చిందంటే వాటిని పరిష్కరించే మార్గాలను వదిలేసి ఆ సమస్యను గోరంతదానిని కొండంతగా చేయడంతోనే అసలు సమస్య మొదలవుతుంది. ఇలా సమస్యను పరిష్కరించుకునే మార్గాలను తెలుసుకునేందుకు సైక్రియాట్రిస్టులను సంప్రదిస్తే వంద శాతం సమస్యను పరిష్కరించుకునే అవకాశాలు ఉన్నాయి.
ముందే గుర్తించవచ్చు..
ఆత్మహత్య చేసుకోవడం నేరం. ఆత్మహత్య చేసుకునే వారిని మనం ముందే గ్రహించవచ్చు. అలాంటి ఆలోచనలు వచ్చిన వారు ఒంటరిగా ఉండడం, మానవ సంబంధాలకు దూరంగా ఉండడం, తీవ్ర ఒత్తిడికి గురవ్వడంతో సెరిటోసైసిన్( సంతోషకరమైన) రసాయనాల శాతం తగ్గిపోతుంది. దీంతో మనిషికి ఆత్మహత్య చేసుకునే ఆలోచన పెరిగిపోతుంది. ఇలాంటి వాటికి అనేక కారణాలు తోడుకావచ్చు. ఉద్యోగం లేకపోడం, తల్లిదండ్రులు, సమాజం వారిని చిన్న చూపుచూడడం ఇలా అనేక కారణాలు కావచ్చు. తీవ్ర ఒత్తిడికి గురైన వ్యక్తులు తన ప్రాణ స్నేహితులతో బాధను పంచుకోవాలి. అయినా ఆత్మహత్యకు దారి తీసే ఆలోచనలు వచ్చినా సైక్రియాట్రిస్టులను సంప్రదిస్తే మంచి కౌన్సెలింగ్ అందించి వారి ప్రాణాలను నిలబెడుతాం. -ప్రొఫెసర్, డాక్టర్ విశాల్ న్యూరో సైక్రియాటిస్టు, నిజామాబాద్