కుమ్రం భీం ఆసిఫాబాద్, జూన్ 11 (నమస్తే తెలంగాణ) : స్వరాష్ట్రంలో లెక్కకు మించిన పథకాలతో సబ్బండ వర్గాలకు భరోసానిస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మరో నాలుగింటికి అంకురార్పణ చేసింది. శుక్రవారం మంచిర్యాలలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం కుల వృత్తులకు రూ. లక్షసాయం, రెండో విడుత గొర్రెల పంపిణీ, దివ్యాంగుల పింఛన్ రూ. 4116కు పెంచడంతో పాటు నిరుపేదలకు ఇండ్ల స్థలాల పంపిణీకి శ్రీకారం చుట్టగా, సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. ముఖ్యమంత్రి చేతుల మీదుగా చెక్కులు అందుకున్న లబ్ధిదారుల్లో సంబురం అంబరాన్నంటింది. కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకాలతో తమ అభిమానాన్ని చాటుకుంటూనే.. నిండు నూరేళ్లు వర్ధిల్లాలంటూ దీవెనలు అందించడం కనిపించింది.
సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలకు శ్రీకారం చుట్టి పకడ్బందీగా అమలు చేస్తున్నది. తెలంగాణ ఏర్పడిన తర్వాత అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా పాలన సాగిస్తూనే కులవృత్తులకూ చేయూతనిస్తున్నది. తాజాగా.. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం మంచిర్యాలలో జరిగిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ నాలుగు పథకాలకు అంకురార్పణ చేయడంపై ఆనందం వెల్లి విరుస్తున్నది. కుల వృత్తుల కోసం రూ. లక్షసాయం, రెండో విడుత గొర్రెల పంపిణీ, దివ్యాంగుల పింఛన్ రూ. 4116కు పెంచడం, నిరుపేదలకు ఇండ్ల స్థలాల పంపిణీకి శ్రీకారం చుట్టడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. ఈ మేరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకాలు చేస్తున్నారు. స్వయం ఉపాధికి బాటలు వేసి తమ బతుకులకు భరోసానిస్తున్న బీఆర్ఎస్ సర్కారు వెంటే ఉంటామంటూ ఆయా వర్గాలు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి.
సీఎం చిత్రపటాలకు పాలాభిషేకం
ప్రభుత్వం దివ్యాంగుల పింఛన్ పెంచడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. ఈ మేరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకాలు చేస్తున్నారు. ఆదివారం కోటపల్లి మండలం మల్లంపేటలో సర్పంచ్ అక్కల మధూకర్ ఆధ్వర్యంలో దివ్యాంగులు సీఎం చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. కన్నెపల్లి మండలం జన్కాపూర్లో వికలాంగులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మందమర్రి పట్టణంలోని బీఆర్ఎస్ బీ1 కార్యాలయం వద్ద దివ్యాంగుల చైతన్య వేదిక ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. దివ్యాంగుల చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు మెడపట్ల సతీశ్ మాట్లాడుతూ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా దివ్యాంగులకు రూ. 4116 పింఛన్ ఇవ్వడం లేదన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ దివ్యాంగుల పాలిట దేవుడయ్యారని కొనియాడారు. నిర్మల్లో స్పందన దివ్యాంగుల సంఘం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. బెల్లంపల్లిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి దివ్యాంగులు పాలాభిషేకం చేశారు. మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్, కౌన్సిలర్ గోసిక రమేశ్, సర్పంచ్ ప్రమీలాగౌడ్, నాయకులు నెలకంటి శ్రీనాధ్, శ్రావణ్….ఆయా చోట్ల బీఆర్ఎస్ నాయకులు సల్పాల పోచం, చిలకమారి మహేందర్, కుమ్మరి రాజేందర్, కోండ్ర సురేశ్, అంగ సంపత్, గారె రమేశ్, పున్నంచంద్, కామెర దేవాజీ, ఆకుదారి దేవాజీ, మాధురి, నానమ్మ, వికలాంగుల కమిటీ సభ్యులు కోట రామయ్య, ఎనగందుల రామయ్య, ఉడుత రాజన్న, బత్తుల చంద్రయ్య, ప్రభాకర్, బోరిగామ జలపతి, అల్లి మల్లేశ్, కళ్ల సురేశ్, అల్లి ప్రశాంత్, వద్దాయి రమణి, షేక్ అక్బర్ హుస్సేన్, రెడ్డి రమేశ్, బలగం శ్రీదేవి, బూరు స్వామి, బర్ల రాయపోశం మాజీ జడ్పీటీసీ అల్లి మోహన్, అధ్యక్షుడు ఇసాక్, నాయకులు నిషిత, శ్రీనివాస్, శివకుమార్, నందుపాల్గొన్నారు.
మళ్లా రూ. వేయి పెంచిండు..
నా పేరు దాసరి రాజన్న. పెంచికల్పేట్ మండలం గొంట్లపేట గ్రామం. కూలీనాలీ చేస్కుంట కుటుంబాన్ని పోషించుకుంటున్న. తెలంగాణ రాకముందు నాయకులు చెప్పినోళ్లకే పింఛన్లు ఇచ్చేటోళ్లు. ఒకవేళ పింఛన్ మంజూరైనా ఎప్పుడచ్చేదో తెల్వక పోతుండే. ఆఫీసుల సుట్టూ తిరిగాల్సి వచ్చేది. మస్తు తిప్పలపడేటోళ్లు. తెలంగాణ వచ్చినంక సర్కారోళ్లు సదరం క్యాంపులు పెట్టి అసలైన వారికే పింఛన్ ఇస్తున్నది. ఒకప్పుడు రూ. 500 పింఛనే వచ్చేది. నిన్న మొన్నటి దాకా రూ. 3016 వచ్చినయ్. ఇప్పుడు మళ్లా రూ. 1000 పెంచిండు. గీ డబ్బులు మా కుటుంబానికి ఎంతో అక్కరకు వస్తాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ సార్కు రుణపడి ఉంటం.
– దాసరి రాజన్న, చెవిటి గొంట్లపేట్
ఆత్మగౌరవాన్ని పెంచింది..
ప్రస్తుతం మాకు పింఛన్ రూ.3,016 వస్తున్నది. మేము ఏం పని చేయలేం. పని చేస్తేనే డబ్బులు వస్తాయి. లేకపోతే బతకడం కూడా కష్టం. దీనిని అర్థం చేసుకున్న దివ్యాంగుల దేవుడు కేసీఆర్ సారు మరో రూ.1000 పెంచుతున్నట్లు ప్రకటించారు. ఇక రూ.4,116 వస్తాయి. అది వచ్చే నెల నుంచే అమలు చేస్తామనడం ఆనందంగా ఉంది. మేము ఎవరిపై ఆధారపడకుండా, ఆత్మగౌరవంతో బతికేలా సారు చేస్తున్నరు. మా లాంటి వారి గురించి ఆలోచిస్తున్న సీఎం సారుకు వికలాంగులు అందరూ రుణపడి ఉంటారు.
– అబ్దుల్, దివ్యాంగుడు, తానూర్.
మా బాగు కోసం గొర్రెలనిస్తుండు..
సీఎం కేసీఆర్ యాదవులకు అందిస్తున్న గొర్రె యూనిట్ల పథకం ఎంతో బాగుంది. నాకు రెండో విడుతలో మంజూరు అయింది. 25 శాతం డీడీ తీసి అధికారులకు అందించా. గొర్రెలు కొనేందుకు మహారాష్ట్రకు అధికారులతో కలిసి వెళ్లి తీసుకొచ్చుకుంటా. ప్రభుత్వం ఇచ్చిన గొర్రె లతో నేను ఆర్థికంగా ఎదిగేందుకు కలిసి వస్తుంది. కూలీ పనికి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఉంటుంది.
– కుమార్,అంకుశాపూర్,ఆసిఫాబాద్
సీఎం సారును మర్చిపోం..
సీఎం కేసీఆర్ సార్ ని నేను నా కుటుంబం ఎప్పుడు కూడా మర్చిపోదు. నాకు మొదటి విడుతలో గొర్రెల యూనిట్ మంజూరు అయింది. నేను స్వయంగా వెళ్లి గొర్లను కొనుకొని వచ్చా. ఇప్పుడు నాలుగేళ్లలో ఒకొ గొర్రె 12 సార్లు సంతతిని అందించింది. వాటి పిల్లలు కూడా పెరిగాయి. ఇప్పుడు నాకు గొర్లమంద ఉంది.
– సంగ రాజయ్య,అంకుశాపూర్,ఆసిఫాబాద్
పథకాల ప్రకటన ముదావహం
మాది కుభీర్ మండలంలోని పార్డి(కే) గ్రామం . నాపేరు సాకలి రమేశ్, నాభార్య సావిత్ర. మేము ముగ్గురం అన్నదమ్ములం. అందరిలో చిన్నవాణ్ణి నేను. మా అమ్మ-నాన్నలు ఊరు ఉతుకుతుండ్రి. నేను చిన్నప్పటి నుండి పాలేరుగా పెద్ద రైతుల వద్ద పని చేస్తున్నా. మా అత్తగారు ఇచ్చిన గుడిసెలో రేకులు వేసుకొని ఉంటున్నాం. మంచిర్యాల సభలో కులవృత్తులకు రూ.లక్ష ఆర్థిక సాయం, గొల్ల, కుర్మలకు గొర్రెలు ఇవ్వడం, నిరుపేదలకు ఇండ్ల పట్టాలు ఇవ్వడం, దివ్యాంగులకు రూ.4,116 ఇస్తామని ప్రకటించడం సంతోషంగా ఉంది.
– సాకలి రమేశ్-సావిత్ర, పార్డి(కె), కుభీర్ మండలం.