ఎదులాపురం,ఆగస్టు 21 : నకిలీ వెబ్సైట్లతో ఫ్రాంచైజీలు ఇప్పిస్తామని ప్రజలను మోసం చేస్తున్న అంతర్రాష్ట్ర సైబర్ నేరగాళ్ల ముఠాను ఆదిలాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. బిహార్ రాష్ట్రానికి చెందిన ఐదుగురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఏఆర్హెడ్ క్వార్టర్స్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. వీరిపై దేశవ్యాప్తంగా దాదాపు 498 సైబర్ నేరాల ఫిర్యాదులు నమోదయ్యాయి. ఇప్పటివరకు సుమారు రూ.3.50 కోట్లు కొల్లగొట్టినట్లు పోలీసులు గుర్తించారు. తెలంగాణలోనే 90 సైబర్ నేరాలకు సం బంధించి ఫిర్యాదులు ఉన్నట్లు తెలిపారు.
సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు బిహార్ రాష్ట్రానికి చెందిన అభిషేక్ కుమార్ అలియాస్ సౌరవ్, ఆశుతోష్ కుమార్ అలియాస్ బబ్లూ, నిషు కుమార్, రితేష్ కుమార్, అభినాష్ కుమార్లను గుర్తించి అరెస్ట్ చేశారు. వారి నుంచి పది మొబైల్ ఫోన్లు, రూ.70 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. బాధితుల నుంచి మోసం చేసి వసూలు చేసిన నగదులో రూ.8 లక్షలను బ్యాంకు ఖాతాల్లో, స్టాక్ మారెట్ షేర్లలో పెట్టుబడిగా పెట్టినట్లు గుర్తించి వాటిని జప్తు చేయడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్రెడ్డి, జైనథ్ సీఐ జి.శ్రావణ్, ఎస్సైలు పీర్ సింగ్, గౌతం, గోపికృష్ణతోపాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
జైనథ్ పోలీస్ స్టేషన్ పరిధి భోరజ్ మండలంలోని మాండగడ గ్రామానికి చెందిన అకునూరు గణేశ్కు నేషనల్ ఫర్టిలైజర్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట నకిలీ ప్రకటన ద్వా రా ఫ్రాంచైజీ ఇప్పిస్తామని నిందితులు నమ్మించారు. ఫో న్, వాట్సాప్, ఈ మెయిల్ ద్వారా సంప్రదించి ఆధార్, పాన్కార్డు, ఫొటో వంటి వ్య క్తిగత వివరాలు సేకరించా రు. తొలుత రిజిస్ట్రేషన్ ఫీజు పేరిట రూ.50 వేలు వసూ లు చేశారు. అనంతరం లైసెన్స్ ఫీజు, ఫ్రాంచైజీ రిజిస్ట్రేష న్, అదనపు ఛార్జీల పేరుతో విడుతలవారీగా డబ్బు చెల్లించాలని ఒత్తిడి చేసి బాధితుడి నుంచి మొత్తం రూ. 3,85,25లను వివిధ బ్యాంకు ఖాతాలు, యూపీఐ, నెఫ్ట్ ద్వారా బదిలీ చేయించుకున్నారు. ఆ తర్వాత ఫోన్ కా ల్స్, వాట్సాప్ సందేశాలకు స్పందించకుండా మోసం చే శారు. ఆన్లైన్ లో రుణాల కోసం వెతికే వ్యక్తులను కూ డా నిందితులు లక్ష్యంగా చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ‘బజాజ్ లోన్’ పేరుతో నకిలీ అప్లికేషన్ల ద్వారా బాధితుల ఆధార్, పాన్ వివరాలు సేకరించి వివిధ రకా ల ఫీజుల పేరిట డబ్బు వసూలు చేసినట్లు పేర్కొన్నారు.