ఆదిలాబాద్, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) :14 ఏండ్లు ఉద్యమించి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకున్న తర్వాత కేసీఆర్ రైతుల కోసం మిషన్ కాకతీయ, 24 గంటల ఉచిత కరెంటు, రైతుబంధు, రైతు బీమావంటి పథకాలను అమలు చేస్తున్నారు. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని రైతులు లాభసాటి వ్యవసాయం చేస్తూ ముం దుకు సాగుతున్నారు. విద్యావంతులు, కార్పొరేట్ సంస్థల్లో పనిచేసే వారు సైతం సొంత గ్రామాలకు తిరిగివచ్చి వ్యవసాయం చేసుకుంటున్నారు అంటే.. తెలంగాణలో వ్యవసాయం ఎంతలా అభివృద్ధి చెందిందో అర్థం చేసుకోవచ్చు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈ ఏడేళ్లలో పంటల సాగు విస్తీర్ణం క్రమంగా పెరిగింది. ఏటా వానకాలంలో 18 లక్షల ఎకరాలు, యాసంగిలో 5 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతున్నాయి. వానకాలంలో వరి, పత్తి, కంది, సోయాబీన్ ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తుండగా, యాసంగిలో 80 శాతం వరిని పండిస్తున్నారు. ఈ నేపథ్యంలో వడ్లు కొనుగోలు చేయబోమని కేంద్ర ప్రభుత్వం తెగేసి చెప్పడంతో ఈ ప్రాంత రైతులు నష్టపోవాల్సిన పరిస్థితి నెలకొంది.
తెలంగాణ రైతులపై చిన్నచూపు..
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆది నుంచి తెలంగాణ రైతులపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా రాజకీయాలు చేస్తూ ఈ ప్రాంత రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్నది. పంజాబ్లో ఎన్నికలు ఉన్నందున అక్కడి ఓట్లు దండుకునేందుకు ధాన్యం సేకరిస్తూ.. ఈ ప్రాంతం రైతులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నది. ఈ నేపథ్యంలో తెలంగాణలో పండిన వడ్లను కొనుగోలు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పలు లేఖలు రాసినా ప్రయోజనం లేకుండా పోయింది. రైతులు నష్టపోకుండా కేంద్ర ప్రభుత్వ బాధ్యతను గుర్తు చేసేందుకు తెలంగాణ మంత్రులు ఢిల్లీకి వెళ్లారు. రైతుల పక్షాన వెళ్లిన రాష్ట్ర మంత్రులను.. కేంద్ర మంత్రులు కలిసేందుకు నిరాకరిస్తున్నారు. మరోవైపు ఈ ప్రాంత రైతులు, మంత్రులను అవమానించేలా కేంద్ర మంత్రి పీయూష్గోయల్ వ్యాఖ్యానించడంపై రైతు సంఘాలు మండిపడుతున్నా యి. వడ్లు కొనుగోలు చేసేదీ లేదని ఇప్పటి వరకు కేంద్రంలో ఉన్న ఏ ప్రభుత్వమూ చెప్పలేదని, బీజేపీ సర్కారు మాత్రం రాజకీయాలు చేస్తూ ఈ ప్రాంత రైతులకు అన్యాయం చేస్తున్నదని మండిపడుతున్నాయి. కేంద్ర సర్కారు వడ్లు కొనుగోలు చే సే వరకూ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఆందోళనలకు తమ మద్దతు ఉంటుందని రైతులు అంటున్నారు.
అవహేళన మానుకోవాలి..
నిర్మల్ టౌన్, డిసెంబర్ 23 : యాసంగి ధాన్యం కొనుగోళ్లపై స్పష్టత ఇవ్వాలని రాష్ట్ర మంత్రులు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ను కలిసేందుకు పోతే పనిలేక వచ్చారా.. అని కేంద్ర మంత్రి అవహేళన చేసి మాట్లాడడం తెలంగాణ జాతికి జరిగిన అన్యాయంగా భావిస్తున్నాం. రైతుల పక్షాన కేంద్రంపై పోరాడుతున్న రాష్ట్ర మంత్రులను గౌరవించాలి. అలాంటిది కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన పీయూష్ గోయల్.. తెలంగాణ ప్రజలకు వెంటనే క్షమాపణ చెప్పాలి.
వివక్ష ఎందుకు..
నిర్మల్ టౌన్, డిసెంబర్ 23 : యాసంగి ధాన్యం కొనుగోలు చేస్తారో లేదో చెప్పాలని సీఎం కేసీఆర్తో సహా రాష్ట్ర మంత్రులు పదే పదే కేంద్రాన్ని అడిగినా స్పష్టత ఇవ్వకుండా అసత్య ప్రచారాలు చేస్తున్నది. తెలంగాణ సర్కారు 24 గంటల కరంట్, సాగునీటి ప్రాజెక్టులు, చెరువుల నిర్మాణం చేపట్టడంతో వరిసాగు విస్తీర్ణం పెరిగింది. అలాంటి వరిపై కేంద్రం కొర్రీలు పెడుతూ కొనుగోలు చేయబోమని చెప్పడం రైతులను మోసం చేయడమే అవుతుంది. కేంద్ర ప్రభుత్వం వెంటనే వరి ధాన్యం రైతుకు దన్నుగా నిలిస్తేనే వారికి ప్రయోజనం ఉంటుంది. – కందూరి పోతన్న, రైతు, కుభీర్
కార్పొరేట్పై ఉన్న ప్రేమ రైతులపై లేదు..
నిర్మల్ టౌన్, డిసెంబర్ 23 : ఆరుగాలం కష్టపడి రైతులు పంటలు పండిస్తే ఆ పంటను కొనుగోలు చేసే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే. పంటలకు చేయూతనందించకపోగా, ఉత్పత్తి చేసిన పంటలపై కొర్రీలు పెడుతున్నది. భవిష్యత్లో రైతుల బతుకు ఏమైతది. కార్పొరేట్ వ్యవసాయానికి అనుకూలంగా చట్టాలను తేవడంలో ఉన్న శ్రద్ధ రైతులు పండించిన వరి ధాన్యం కొనుగోళ్లపై ఎందుకు లేదు. ఎన్ని డబ్బులు సంపాదించినా అందరికీ అన్నం పెట్టేది రైతన్న మాత్రమే. అలాంటి రైతులను ఏ ప్రభుత్వం విస్మరించినా భవిష్యత్లో పుట్టగతులుండవ్.
పార్లమెంట్ సాక్షిగా అబద్ధాలు..
నిర్మల్ టౌన్, డిసెంబర్ 23 : రైతులు ఏ పంట పండించినా కొనుగోలు చేసే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే. స్థానిక వనరులను బట్టి రైతులు ఏ పంట వేసుకోవాలో వారే నిర్ణయించుకుంటారు. కానీ కేంద్ర ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నది. కొనుగోళ్లపై పార్లమెంట్లో ఐదు రోజులు ఎంపీలు.., మరో మూడు రోజులు ఢిల్లీలో మంత్రులు సమస్యను కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. అయినా పార్లమెంట్ సాక్షిగా కేంద్ర సర్కారు పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ రైతులను మోసం చేస్తున్నది.
రైతుల ప్రతినిధులుగా మంత్రులు వెళ్లారు
రైతులు నష్టపోకుండా రైతుల ప్రతినిధులుగా రాష్ట్రమంత్రులు ఢిల్లీకి పోయారు. దేశంలో ఎక్కడైనా ధాన్యం కొనుగోలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంటుంది. వారి బాధ్యతను విస్మరిస్తున్నారు. వడ్లను కొనుగోలు చేసేది లేదని అంటున్నారు. రాష్ట్ర బీజేపీ నాయకులు వడ్లు పండించాలంటూ రైతులను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. – మధు, రైతు, లోలం, దిలవార్పూర్, మండలం