నిర్మల్ చైన్గేట్, జూలై 16 : మూగ, చెవిటి, దృష్టి, మానసిక వ్యాధితో బాధపడే చిన్నారులకు మెరుగైన వైద్యం అందించాలని రాష్ట్ర సర్కారు సంకల్పించింది. ఇందుకుగాను రాష్ట్రీయ బాలల స్వస్థ్య రక్షణ(ఆర్బీఎస్కే) పథకంలో భాగంగా నిర్మల్లో డైస్(డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వేషన్ సెంటర్) కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. దీనిని నిర్మల్ జిల్లా కేంద్రంలోని మాతా శిశు సంరక్షణ కేంద్రం(ఎంసీహెచ్) పై అంతస్తులో ఏర్పాటు చేశారు. ఈ కేంద్రానికి అంగన్వాడీ, పాఠశాలల్లో వైకల్యం ఉన్న చిన్నారులను గుర్తించి ఆర్బీఎస్కే మొబైల్ వాహనాల ద్వారా తీసుకొచ్చి చికిత్స అందిస్తారు. చిన్నారులను ఆకట్టుకునే విధంగా చిత్రాలు వేయించారు. 13 మంది సిబ్బంది అవసరం కాగా.. 11 మంది విధుల్లో చేరారు. వీరికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి.. త్వరలో డైస్ కేంద్రాన్ని ప్రారంభించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
సంపూర్ణ ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోంది. వైద్యరంగం అభివృద్ధికి సీఎం కేసీఆర్ కోట్లాది రూపాయలు కేటాయిస్తున్నారు. ఇందులో భాగంగానే రాష్ట్రీయ బాలల స్వస్థ్య రక్షణ(ఆర్బీఎస్కే) పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలనే ఉద్దేశంతో మంత్రి ఇంద్రకరణ్రెడ్డి ప్రత్యేక చొరవ తీ సుకొవడంతో నిర్మల్లో డైస్(డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వేషన్ సెంటర్) కేంద్రాన్ని మంజూరైంది. నిర్మల్ మాతా శిశు సంరక్షణ ఆరోగ్య కేంద్రం పైఅంతస్తులో అధునాతన హంగులతో గదులు నిర్మించారు. గోడలపై చిన్నారులను ఆకట్టుకునే విధంగా చిత్రాలు వేశారు. డైస్ కేంద్రం వల్ల చిన్నారులకు సేవలు అందుబాటులోకి రానున్నాయి. వైద్యుల కోసం నోటిఫికేషన్ విడుదల చేయగా.. సిబ్బంది నియామకం జరిగింది. ఫిజియోథెరపీ పరికరాలు కేంద్రానికి వచ్చాయి. అంగన్వాడి కేంద్రాలు, పాఠశాలల్లో వైక ల్యం ఉన్న చిన్నారులను గుర్తించి ఆర్బీఎస్కే మొబైల్ వాహనాలలో కేంద్రానికి తీసుకొచ్చి చికిత్స అందిస్తారు. కేంద్రాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
పుట్టుకతో వచ్చే వ్యాధులకు చికిత్స
డైస్ కేంద్రంలో అప్పుడే పుట్టిన పసిబిడ్డలతో మొదలుకొని 18 ఏళ్ల లోపు వయస్సున్న వారికి వైద్య సేవలందిస్తారు. పుట్టుకతో అనేక రుగ్మతలతో బాధపడే వారికి చికిత్స అందిస్తారు. మూగ పిల్లలు, వినికిడి లోపం ఏ మేరకు ఎంత శాతం ఉన్నది గుర్తించి చికిత్స చేస్తారు. దృష్టిలోపం, మానసిక వ్యాధితో బాధపడే చిన్నారులకు నిపుణులతో చికిత్స అందిస్తారు. ఇందుకు ఆయా విభాగాలకు ప్రత్యేక గదులు కేటాయించారు. కాగా..13 మంది సిబ్బంది అవసరం ఉండగా.. 11 మంది విధుల్లో చేరారు. వీరికి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. కాగా.. త్వరలో డైస్ కేంద్రాన్ని ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్మల్ జిల్లా వైద్యాధికారి ధన్రాజ్ తెలిపారు.