ఆసిఫాబాద్ అంబేద్కర్ చౌక్, నవంబర్ 2: దళితుల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన దళితబంధు యూనిట్లను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా ఎదగాలని కుమ్రం భీం ఆసిఫాబాద్ కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని టాటియా గార్డెన్లో ఏర్పాటు చేసిన దళితబంధు మొదటి విడుత లబ్ధిదారుల ముఖాముఖి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చాహత్ బాజ్పాయి, ఆసిఫాబాద్, సిర్పూర్ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, కోనేరు కోనప్పతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దళితబంధు పథకం ద్వారా ట్రాక్టర్లు, బొలేరో వాహనాలు, భవన నిర్మాణ రంగ యూనిట్లు, పౌల్ట్రీ ఫామ్, పాల ఉత్పత్తి కేంద్రాలు, కిరాణాలు, టెంట్ హౌస్ వంటి అనేక యూనిట్లను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఆసిఫాబాద్ నియోజకవర్గంలో 77, సిర్పూర్ నియోజకవర్గంలో 100 మంది లబ్ధిదారులకు దళితబంధు పథకం అందించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సజీవన్, ముఖ్య ప్రణాళిక అధికారి రవీందర్, పశు సంవర్ధక శాఖ అధికారి సురేశ్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి సురేందర్, లీడ్ జిల్లా మేనేజర్ హనుమంతరావు, విద్యుత్ శాఖ డీఈ వాసుదేవ్, ఏపీఎంలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
రైతుల అభివృద్ధి, సంక్షేమానికి కృషి
ఆసిఫాబాద్, అంబేద్కర్ చౌక్ 2 : జిల్లాలోని రైతుల అభివృద్ధి, సంక్షేమానికి అన్ని శాఖల సమన్వయంతో కృషి చేస్తున్నట్లు ్ల కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లో బ్యాంక్ అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు, ఇతర జిల్లాల అధికారులతో నాబార్డు, ఎఫ్పీవోపై సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో అధిక శాతం పత్తి, కంది పంటలను సాగుచేస్తున్నారని, లాభదాయకమైన ఆయిల్ పాం సాగు చేసే విధంగా అవగాహన కల్పించాలన్నారు. రైతుల కోసం నాబార్డు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాబార్డు డీఏవో శ్రీనివాస రావు, ఏడీఏ మిలింద్, ఇరిగేషన్ ఈఈ గుణవంత్రావు, తదితరులు పాల్గొన్నారు.
ప్రణాళికాబద్ధంగా ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేయాలి
ఆసిఫాబాద్ అంబేద్కర్చౌక్, నవంబర్ 2 :జిల్లాలో చేపట్టిన వివిధ ప్రాజెక్టులు, కాలువల నిర్మాణ పనులు సంబంధిత శాఖల అధికారులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. బుధవారం అదనపు కలెక్టర్ రాజేశం, డీఆర్వో సురేశ్ కలిసి నీటిపారుదదల, రెవెన్యూ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రాజెక్టులు పూర్తి చేసి సబ్ డివిజన్లు ఏర్పాటు చేయాలని భూ సేకరణ పనులను వెంటనే చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వర్షాలతో దెబ్బతిన్న కాలువలు, ప్రాజెక్టులు, చెరువుల మరమ్మతులు, పెండింగ్ పనులను పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు తదితరులు ఉన్నారు.