కుమ్రం భీం ఆసిఫాబాద్, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ) : ఆదివాసుల ఆరాధ్య దైవం కుమ్రం భీం పోరుగడ్డ జోడెఘాట్ ప్రగతి బాట పట్టింది. గత పాలకుల పట్టింపులేని తనంతో ఆనవాళ్లు కోల్పోగా, స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు చొరవతో అభివృద్ధి చెందింది. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత 2014లో జోడెఘాట్లో నిర్వహించిన కుమ్రం భీం వర్ధంతికి ఆయన హాజరై చరిత్ర సృష్టించారు. పోరుగడ్డ సాక్షిగా ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారు. ప్రధానంగా డబుల్ రోడ్డు నిర్మించి 12 గ్రామాల ఇబ్బందులను తొలగింపజేశారు.
జోడేఘాట్కు వేసిన డబుల్ రోడ్డు.. దశాబ్ధాల ఆదివాసీల దారి కష్టాలను తీర్చింది. కెరమెరి మండలం హట్టి గ్రామం నుంచి జోడెఘాట్ సుమారు 23 కిలోమీటర్లు ఉంటుంది. సరైన రోడ్డు వసతి కూడా ఉండేది కాదు. జోడెఘాట్తోపాటు మార్గమధ్యంలో ఉన్న 12 ఆదివాసీ గ్రామాల ప్రజలు కూడా కెరమెరి మండల కేంద్రానికి రావాలంటే ఎంతో వ్యయప్రాయాసలు పడాల్సి వచ్చేది. 2014లో సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా జోడెఘాట్ను సందర్శించి అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు మంజూరు చేశారు. ప్రధానంగా రూ. 15.70 కోట్లతో ప్రభుత్వం రెండు వరుసల రహదారి నిర్మించింది. పిట్టగూడ, టోకెన్మోవాడ్, బాబెఝరి, శివగూడ, కొలాంగూడ, చిన్నపాట్నాపూర్, పాట్నాపూర్, గోపర, లైన్పటార్, పాఠగూడ, చాల్బడి గ్రామాలకు రహదారి సౌకర్యం ఏర్పడింది. గతంలో తమ అవసరాల దృష్ట్యా మండల కేంద్రానికి కాలినడక, ఎడ్ల బండ్లపైనే వెళ్లేవారు. దశాబ్దాల పాటు అష్టకష్టాలు పడ్డ గిరిజనులు ఇప్పుడు నిమిషాల వ్యవధిలోనే మండల కేంద్రానికి చేరుకోగలుగుతున్నారు. ఏదైనా ఆపద వస్తే ఒక్క ఫోన్కాల్తో ఆంబులెన్స్ వచ్చి ఆస్పత్రికి తీసుకెళ్తోంది. జోడెఘాట్ గ్రామానికి రెండు వరుసల శాశ్వతమైన రహదారి నిర్మాణంతో పోరు గ్రామాల ప్రజలకు దారి కష్టాలు శాశ్వతంగా దూరమయ్యాయి.
తెలంగాణ వచ్చి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత జోడెఘాట్ పర్యాటకంగా ఎంతో అభివృద్ధి చెందింది. రూ. 25 కోట్లతో గిరిజన మ్యూజియం, స్మారక చిహ్నం, స్మృతి వనం కూడా ఏర్పాటు చేసింది. 12 గ్రామాల పరిధిలోని పిల్లల కోసం రూ. 2.95 కోట్లతో ఆశ్రమ పాఠశాల నిర్మించారు. జోడెఘాట్తో పాటు పరిసర గ్రామాల్లో సీసీ రోడ్లు నిర్మించారు. 12 గ్రామాలకు ఇంటింటికీ స్వచ్ఛమైన తాగు నీరు అందిస్తున్నారు. జోడెఘాట్ గ్రామానికి త్రీఫేస్ విద్యుత్ సౌకర్యం కల్పించారు. గిరిజన రైతులకు ఎడ్ల జతలు, బండ్లను ఐటీడీఏ ద్వారా అందించారు. విద్య, వైద్య సదుపాయాలు అందుబాటులోకి తెచ్చారు. జోడెఘాట్లో ప్రత్యేకంగా 26 డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు చేశారు. మా ఊళ్లో.. మా రాజ్యం అనే భీం నినాదానికి జీవం పోసిన తెలంగాణ ప్రభుత్వం, 500 జనాభా కలిగిన గిరిజన గ్రామాలను కొత్త పంచాయతీలుగా ఏర్పాటు చేసింది.
తెలంగాణ రాకముందు మమ్ముల పట్టించుకోన్నోళ్లు లేకుండే. ముఖ్యంగా రోడ్డు లేక మస్తు తిప్పల పడ్డం. కెరమెరికి పోవాలంటే కాలినడకే దిక్కయ్యేది. లేదంటే ఎడ్ల బండ్ల మీద పోవాల్సి వచ్చేది. కెరమెరికి పోయిరావాల్నంటే రోజంతా పట్టేది. తెలంగాణ వచ్చినంక జోడెఘాట్కు డబుల్ రోడ్డు వేసిన్రు. ఇప్పుడ మా ఊరికి ఆటోలు వస్తున్నయ్. ఇప్పుడు అట్లపోయి.. ఇట్ల వస్తున్నం. రోడ్డు మంచిగైనంక జోడెఘాట్ను చూసేందుకు అనేక మంది కార్లళ్ల వస్తున్నరు.
– ఆత్రం భీము, కొలాంగూడ, జోడేఘాట్ పరిసర గ్రామం
తెలంగాణ వచ్చినంక మా ఊరు మంచిగైంది. కేసీఆర్ సార్ జోడెఘాట్కు వచ్చి మా బాధలను తెలుసుకున్నడు. కెరమెరి నుంచి జోడెఘాట్ దాకా పెద్ద రోడ్డు వేయించిన్రు. జోడెఘాట్ పక్కన ఉన్న అన్ని ఊర్లకు నల్లాలతోనే ఇంటింటికి నీళ్లు వస్తున్నయ్. కరెంటు కూడా వచ్చింది. జోడెఘాట్లో అందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు వచ్చినయ్. మా జోడెఘాట్ని సూసేందుకు బాగా మంది వస్తున్నరు. జోడెఘాట్కు మంచి పేరు తీసుకొచ్చిన్రు.
– ఆత్రం జుగాదిరావ్, జోడేఘాట్