కుభీర్ : నిర్మల్ జిల్లా కుభీర్ మండలం పల్సి గ్రామం ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు రూ. 25 వేల విలువచేసే శుద్ధ జల యంత్రాన్ని ( Pure water machine ) గ్రామానికి చెందిన యువకుడు పురం శెట్టి రవికుమార్ ( Ravi kumar ) అందించి ఔదార్యాన్ని చాటుకున్నాడు. శుక్రవారం పాఠశాలలో జరిగిన 79వ స్వాతంత్ర దినోత్సవంలో ( Independence Day) భాగంగా పాఠశాలలో యంత్రాన్ని బిగింపజేసి హెచ్ఎం దొంతుల సురేష్ తో కలిసి ప్రారంభించారు.
పాఠశాల విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణతో పాటు శుద్ధ జల సేవనంతో విద్యార్థులకు ఎలాంటి అనారోగ్యాలు దరిచేరకుండా ఉండేందుకు దోహదపడతాయని అభిప్రాయపడ్డారు. 100 లీటర్ల సామర్థ్యం కలిగిన ఈ శుద్ధ జల యంత్రాన్ని సక్రమంగా వినియోగించు కోవాలని దాత రవికుమార్ సూచించారు. ఈ సందర్భంగా దాతను పాఠశాల ఆధ్వర్యంలో హెచ్ఎం దొంతుల సురేష్, ఉపాధ్యాయులు, గ్రామస్థులు శాలువాతో సత్కరించి అభినందించారు.
పాఠశాల అభివృద్ధికి గ్రామంలోని దాతలు ముందుకు వచ్చి విద్యార్థులకు మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు తమవంతు సహాయ సహకారాలు అందించాలని హెచ్ఎం కోరారు. అంతకుముందు పాఠశాలలో గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఆర్పీ బాలేరావ్ గంగాధర్, సాయి కుమార్, టెలికాంబోర్డు మాజీ సభ్యుడు పబ్బు ధర్మపురి, పంచాయతీ కార్యదర్శి పాండు సింగ్, ఉపాధ్యాయులు, గ్రామస్థులు పాల్గొన్నారు.