మంచిర్యాల ప్రతినిధి/కుమ్రం భీం ఆసిఫాబాద్, మార్చి1 (నమస్తే తెలంగాణ): వంట గ్యాస్ ధరలు మళ్లీ భగ్గుమన్నాయి. వంటింట్లో గ్యాస్ మంటలు చెలరేగుతున్నాయి. గృహావసరాల సిలిండర్పై 50, వాణిజ్యంపై 360 తాజాగా పెంచడంతో మరోసారి ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఇంట్లో వినియోగించే 14.2 కేజీల సిలిండర్ ధర రూ. 1177, వాణిజ్య అవసరాలకు వినియోగించే 19 కేజీల ధర రూ.2591.50కు చేరడంపై పేద, మధ్యతరగతి వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ధరలు పెంచుతూ చుక్కలు చూపుతున్నదని మండిపడుతున్నాయి. మారుమూల గ్రామాల ప్రజలైతే సిలిండర్లను మూలన పడేసి కట్టెల పొయ్యి వాడాల్సిన దుస్థితి నెలకొన్నది. ఈ నేపథ్యంలో బీజేపీ తీరుపై మంత్రి, ఎమ్మెల్యేలు ఆగ్రహిస్తున్నారు. నేడు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతామని, ధరలు తగ్గించేదాకా ఊరుకునేది లేదని స్పష్టం చేశారు.
గ్యాస్ బండ గరీబోళ్లను వెక్కిరిస్తున్నది. నెల రోజుల రెక్కల కష్టం పెట్టి నన్ను కొంటివా.. నీకు తినేందుకు తిండే ఉండదని భయపెడుతున్నది. అసలు నాలుగైదేళ్ల క్రితం వరకు గ్యాస్ అంటే ఏమిటో కూడా తెలియని వాళ్లకు ఉజ్వల, దీపం పథకాల కింద ఉచితంగా కనెక్షన్లు ఇచ్చారు. అప్పుడు రూ.600లకు గ్యాస్ సిలిండర్ ఇచ్చారు. అనంతరం కొన్ని రోజులకు గ్యాస్ బండ ధర రూ.700 అయ్యింది. ఆ తర్వాత రూ.800.. ఆపై రూ.900, ఇలా పెరుగుకుంటూ ఈ రోజు రూ.1177 చేరి గరీబోళ్ల పాలిట గుదిబండైంది. పెరిగిన గ్యాస్ ధరలు భరించలేమంటూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గ్రామీణ పేదలు గ్యాస్ సిలిండర్లు మూలన పడేశారు. మునుపటిలాగే కట్టెలు తెచ్చుకొని వంట చేసుకుంటున్నారు. మా బతుకేదో మేం బతుకుంటే గ్యాస్ అలవాటు చేశారని, ఇప్పుడేమో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ధరలు పెంచి మా నడ్డి విరుస్తున్నదని వాపోతున్నారు. కైకిలిపోతే వచ్చే డబ్బులు ఇంట్లో సామాను తీసుకోవడానికే సరిపోవడం లేదని, ఇలాంటి పరిస్థితుల్లో గ్యాస్ కొనలేమంటున్నారు. కొందరు కట్టెల పొయ్యిలు వాడుతుండగా, మరికొందరు ప్రత్యామ్నాయంగా కిరోసిన్ స్టవ్లు, ఎలక్ట్రికల్ పొయ్యిలు, కుక్కర్లను వాడుతున్నారు.
మళ్లీ పాతరోజులు..
ఆసిఫాబాద్ జిల్లాలోని మారుమూల ప్రాంతాలైన బెజ్జూరు, దహెగాం, పెంచికల్పేట, చింతలమానేపల్లి, సిర్పూర్లో మళ్లీ కట్టెల పొయ్యిలే వాడుతున్నారు. గతంలో మైళ్ల దూరం అడవిలోకి నడిచి కట్టెలు తెచ్చుకోవడం.. పొరపాటున అధికారులకు దొరికితే కేసులు పెట్టడం.. ఇగ ఈ లొళ్లంతా ఎందుకని కనెక్షన్లు తీసుకున్నోళ్లు ఇప్పుడు ఆ గ్యాస్ బండలను మూలకు పెట్టేశారు. దేశంలో మోదీ అధికారంలోకి రాకముందు గ్యాస్ సిలిండర్ ధర చాలా తక్కువ. 2014లో రూ.414 ఉన్న గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ ధర ప్రసుత్తం రూ.1177కి చేరింది. అంటే రెండు రెట్లు పెరిగింది. ఏడాది క్రితం వరకు 2021లో రూ.819 ఉన్న సిలిండర్, గతేడాది చివరి (డిసెంబర్ 2022) నాటికి రూ.1044కు పెరిగింది. కానీ డెలివరీ చార్జీలతో కలిపి రూ.1160 వరకు తీసుకున్నారు. నాలుగేళ్ల క్రితం ప్రధాన మంత్రి ఉజ్వల్ యోజన కార్యక్రమం కింద మోదీ ప్రభుత్వం ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇచ్చింది. అప్పుడు సిలిండర్ ధర అక్షరాల రూ.600. మారుమూల ప్రాంతాల్లో విస్తృత ప్రచారం చేసి, తక్కువ ధరకే సిలిండర్లు వస్తున్నాయని జనాలకు అవగాహన కల్పించి మరీ కట్టబెట్టారు. ఇలా దేశవ్యాప్తంగా 2022 నవంబర్ 20 నాటికి 47,82,899 కనెక్షన్లు, గ్రా మీణ ప్రాంతాల్లో 98 శాతం ఇండ్లలో గ్యాస్ కనెక్షన్లు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.
భారమైన భరించాం.. ఇగ కష్టం..
‘నాలుగేళ్ల క్రితం గ్యాస్ కనెక్షన్ తీసుకున్నప్పుడు గ్యాస్ సిలిండర్ రూ.600 ఉండే. మరుసటి ఏడాది రూ.700 చేసిన్రు. గతేడాది రూ.800 ఉండే.. ఇప్పుడు ఏకంగా రూ.1177 వరకు పెంచిన్రు. పొగగొట్టం పట్టుకొని ఊదుడు ఏందీ.. గ్యాస్ కొనుడే మంచిదనుకున్నాం. పొయ్యి ఉన్నప్పుడు లేనిపోని రోగాలు వచ్చేవి అవి తగ్గినయ్.. అందుకే రేటు ఎక్కువైనా గ్యాస్ వాడాలనుకున్నాం. రూ.1000 వరకు పెరిగినా భరించాం. కానీ ప్రస్తుతం రూ.1177కు పెంచారు. ఇగ మాతో కాదు. పేదలకు కనెక్షన్లు ఇచ్చినప్పుడు వారికి అందుబాటులో ఉండే ధరకే ఇవ్వాలే. మొన్నటి వరకు సబ్సిడీ కూడా ఇచ్చినోళ్లు.. ఇప్పుడు అది కూడా బంద్ చేసిన్రు. ఉచితంగా వచ్చే కట్టెలను కాదని మేం పైసలు పెట్టి గ్యాస్ ఎందుకు వేయించుకోవాలే. కేంద్రంలో మోదీ సర్కారు పేదలను భరించలేనంతగా ధరలు పెంచింది. ఒకప్పుడు రూ.100 పెట్టి పెట్రోల్ తీసుకుంటే మూడుసార్లు కాగజ్నగర్ పోయి వచ్చేటోళ్లం. ఇప్పుడు ఒక్కసారి పోయివచ్చి మళ్లోసారి పోవాలంటేనే పెట్రోల్ కొట్టించాల్సి వస్తుంది. రెక్కల కష్టం చేసుకునేటోళ్లం. మా కూలి పెరుగుత లేదు గానీ అన్ని ధరలైతే మస్తు పెరుగుతున్నాయ్’ అని చెప్పుకుంటూ పలువురు పేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రూ.400 అదనపు భారం..
ఒక కనెక్షన్పై ఏడాదికి 12 సిలిండర్లు తీసుకోవచ్చు. కానీ గృహ అవసరాలకు సాధారణంగా 7 నుంచి 8 సిలిండర్లు సరిపోతాయి. ఈ లెక్కన ప్రస్తుతం పెంచిన రూ.50తో ఒక్కో కుటుంబంపై ఏడాదికి రూ.400 అదనపు భారం పడుతుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 7,90,968 గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. ఒక్కో కనెక్షన్పై రూ.400 అదనపు భారం కలిపితే ఏడాదికి రూ.31.63 కోట్లు అవుతుంది. ఇక కమర్షియల్ సిలిండర్ ధరను రూ.360 పెంచారు. నిన్నటి వరకు రూ.2231గా ఉన్న ధర ఒక్కసారి రూ.2591.50కు చేరింది. దీంతో వ్యాపారులు లబోదిబోమంటున్నారు. చిన్నచిన్న హోటళ్ల యాజమానులు, మిర్చీ బండీల నిర్వాహకులు వ్యాపారం చేసే రోజులు లేవంటున్నారు.
ధరలు పెంచి ధనవంతులకు పెడుతుండు..
కుభీర్, మార్చి 1: కేంద్ర సర్కారోళ్లు ధరలు పెంచి, ధనవంతులకు దోచి పెడుతున్నరు. ఇప్పటికే గ్యాస్ కొనాల్నంటే కన్నీళ్లోస్తున్నయ్. ఇప్పుడు రూ.50 పెంచుతూ తీసుకున్న నిర్ణయం పేద, సామాన్యవర్గాలకు గుదిబండగా మారింది. మెల్లమెల్లగా సబ్సిడీలను ఎత్తేసి పేదలపై పెనుభారం మోపుతోంది. ఇది సరైంది కాదు. రానున్న కాలంలో మూల్యం చెల్లించుకోక తప్పదు. రూ.450 ఉన్న వంటగ్యాస్ ధర ఏకంగా రూ.1180 చేరుకోవడం విడ్డూరంగా ఉంది. ఇప్పటికే పెరిగిన నిత్యావసర సరుకుల ధరలతో విలవిలలాడుతున్నం. వంటగ్యాస్ ధరలు ఇప్పుడు మరింత దుఃఖం తెస్తున్నయ్. వెంటనే పెంచిన వంటగ్యాస్ ధరలను వెనక్కి తీసుకోవాలి.
–తౌటి హన్మాండ్లు, వ్యవసాయ కూలీ, పల్సి
పేదల ఉసురు తగులుతది..
కుభీర్, మార్చి 1: గ్యాస్ పొయ్యి మీద వంటంటే భయపడే రోజులొచ్చినయ్. మోడీ అచ్చేదిన్ అంటూ పేదోడు మునిగే రోజులు తెచ్చిండు. ఇగ పేదోడు వంట చేసుకోకుండా, సరుకులు కొనకుండా చేస్తున్నడు. పెద్దోళ్లకు మంచి చేసేందుకు పేదోళ్ల కడుపు కొట్టే పనులు చేస్తున్నడు. ఒక్క రోజులనే గ్యాస్ ధర రూ.50 పెంచుతూ నిర్ణయం తీసుకోవడం అన్యాయం. మళ్లీ కట్టెల పొయ్యే మేలు అనే కాడికి వచ్చింది. కేంద్ర ప్రభుత్వానికి పేదల ఉసురు తగిలే రోజులు దగ్గర పడ్డాయి. పేద, మధ్య తరగతి సామాన్య ప్రజలు తిరగబడితే బీజేపీ డబ్బా మూసుకోవాల్సిందే. ఇది తెలుసుకుంటే మంచిది. లేకుంటే కాంగ్రెసుకు పట్టిన గతే బీజేపీకి పడుతుంది.
-కొట్టె సుభాష్, రైతు, పల్సి
గరీబోళ్ల మీద గుదిబండ
భీంపూర్, మార్చి 1: మాది చిన్న రైతు కుటుంబం, అవ్వా, బాపు గింత ఎవుసం జేస్తే నేను ఊళ్లనే ఫెర్టిలైజర్, ఫెస్టిసైడ్ దుకాణంల పని జేస్తున్న. ఊకూకె గ్యాస్ సిలిండర్ల ధరలు పెంచుడుతోని పరేషానవుతున్నది. ఇప్పటికే సిలిండర్ వాడాల్నంటే భయపడుతున్నం. ఇగ ఇప్పుడు మరో రూ.50 పెంచి మరింత ఇబ్బందుల్లోకి నెట్టిన్రు. ఒక్క సిలిండర్ కొనాల్నంటే రూ. పన్నెండునూర్ల దెగ్గరయింది. నా కచ్చేటి జీతంల గ్యాస్కే ఎక్వ పోతున్నది. ఇట్ల పెంచుకుంట పోతే అడ వులు రక్షించుడు అటుంచుతే అందరూ కట్టెల కోసం ఎగబడతరు. ఇప్పటికైనా సిలిండర్ ధరలు తగ్గించి, పేదోళ్లకు న్యాయం జెయ్యాలే. లేకుంటే బీజేపోళ్లకు బుద్ధి వచ్చేలా సామాన్యులు ఆందోళనలకు సిద్ధమవుతరు.
– గర్క గజానన్ యాదవ్, ప్రైవేట్ ఉద్యోగి, కరంజి(టీ)
వర్షకాలంలో ఎట్లనో..
బెజ్జూర్, మార్చి 1 : గ్యాస్ కొందామంటే రూ.1210 చేసిన్రు. ఇగ కట్టెల పొయ్యిమీద వండుకుందామని అడవికి పోతే.. ఫారెస్టోళ్లు వద్దనవట్టె. ఇగ మాలాంటి పేదోళ్లు బతుకు డో.. సచ్చుడో కేంద్ర సర్కారోళ్లే చెప్పాలే. ఏడాదిన్నర సంది గ్యాస్ వేయించుకునుడు బంద్ చేసినం. కట్టెల కోసం అడవికి పోతె పులులు, అడవి పందుల భయం.. అందుకే వాడలోని మహిళలతో కలిసి చెట్టూ పుట్ట తిరిగి పుల్లలు ఏరుకొని వస్త. పొద్దునపోతే సాయంత్రమైతది. ఇగ వర్షాకాలమస్తే మస్తు గోసయ్యేటట్లు ఉంది.
– చింతల అమృత, బెజ్జూర్
కట్టెల పొయ్యే నయ్యం..
ఇంద్రవెల్లి, మార్చి1: కట్టెల పొయ్యే వాడే పరిస్థితులు వచ్చినయ్. నేను 15 ఏండ్ల సంది గ్యాస్తోనే వంటలు చేస్తున్న. ఇప్పుడు సిలిండర్ బండ కొనాలంటే భయమైతాంది. నేను వ్యవసాయ కూలీ పనులు చేస్తుంట. ఇప్పుడు పెరిగిన రేటు పెట్టి కొనాల్నంటే నాతోని కాదు. సరుకులు కొనే పరిస్థితి లేదు. ఇప్పుడు నెలకోసారి గ్యాస్ ధరలు పెరుగుతు న్నయ్. ఇప్పటికే రూ. 1125 పెడుతు న్నం. మళ్లీ ఇప్పుడు మరో యాభై రూపాలు పెంచి, మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నరు. గతంలో గ్యాస్పై సబ్సిడీ డబ్బులు అచ్చేటియి. ఇప్పుడు అవి కూడా అస్తలేవు. ఇగ గ్యాస్ కొనుడు కంటే, నాలుగు కట్టెలు తెచ్చుకుని వంట చేసుకుందామని అనుకుంటున్న. వ్యవసాయ పనులకు పోయినప్పుడు నాలుగు పుల్లలు తెచ్చుకుంటే సరిపోతుంది. పొగతో ఇబ్బందయితదని గ్యాస్ బండ వాడితే, ఇయ్యాల కేంద్ర సర్కారోళ్లు మా మీద పెద్ద బండ వేసిన్రు. బీజేపీ సర్కారు అచ్చినంక పేదోళ్లు బతికే పరిస్థితే లేదు.
–వాగ్మారే భీమాబాయి(బుద్ధనగర్)
ఇగ గ్యాస్కు పైసలెక్కడియ్
బెజ్జూర్, మార్చి 1 : మా ఇంట్లో మొత్తం ఆరుగురం ఉంటం. ఊకె పొయ్యి ముందు ఊదుడు ఏందీ గ్యాస్ కొనుడే మంచిదనుకున్నం. ఐదేండ్ల కింద గ్యాస్ కనెక్షన్ తీసుకున్నం. రూ 4500 ఉంటే.. ఆఫర్ కింద రూ. 3700కే ఇచ్చిన్రు. మస్తు సంబురపడ్డం. అప్పుడు సిలిండర్ ధర రూ. 500లే ఉండే. మాకు రెండు నెలలచ్చేది. రాను రానూ ధర పెంచుకుంట వచ్చిన్రు. ఇప్పుడు రూ. 1177 ఉంది. మాకు ఎవుసంలేదు. రోజూ కూలీ పనులకు పోతం. అన్ని ధరలు పెంచవట్టే. పూట గడవడమే కష్టంగా ఉంది. ఇగ గ్యాస్కు పైసలు ఎక్కడి నుంచి వస్తయ్. అందుకే కట్టెల పొయ్యిపై వండుకొని తింటున్నం.
– నికాడి గౌరు, బెజ్జూర్