మంచిర్యాల ఏసీసీ, ఫిబ్రవరి 3: జిల్లాలోని ప్రైవేటు దవాఖానల్లో పూర్తి స్థాయిలో సిజేరియన్ కాన్పులను తగ్గించాలని మంచిర్యాల డీఎంహెచ్వో డా.జీ. సుబ్బారాయుడు అన్నారు. శనివారం జిల్లా సమీకృత కలక్టరేట్ కార్యాలయంలోని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో వైద్య, ఆరోగ్యశాఖ కమిషనర్తో ప్రసవాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా డీఎంహెచ్వో మాట్లాడుతూ సిజేరియన్ కేసులు ప్రైవేటు దవాఖానల్లో ఎక్కువవుతున్నందున, మూడు ప్రత్యేక బృందాలు ఏరాపటు చేసి, తనిఖీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలోని 14 ప్రైవేటు దవాఖానలను ఈ బృందాలు సందర్శించి సీ సెక్షన్ పైన నివేదిక తయారు చేసి ఇవ్వాలని అదేశాలిచ్చినట్లు పేర్కొన్నారు. అలాగే ఎంసీహెచ్లో వ్యాధినిరోదక టీకాలు, క్షయావ్యాధి (ఎన్టీఈపీ), సికిల్సేల్ ఎనిమియా, ఎన్సీడీ (అసంక్రమణ వ్యాధులు, ఆయుష్మాన్భవ) పై పీహెచ్సీ వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించినట్లు పేర్కొన్నారు.
ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాల లక్ష్యాలను చేరుకోనందున, వివరాల నమోదు, ఏఎన్సీ రిజిస్ట్రేషన్ చేయనందున జిల్లాలోని పీహెచ్సీ, యూపీహెచ్సీ 12 మంది వైద్యాధికారులకు శనివారం మెమోలను ఇచ్చారు. ఇందులో హాజీపూర్, రాజీవ్నగర్, శంషీర్నగర్, తాండూర్, నస్పూర్, అంగరాజ్పల్లి, దండేపల్లి, పాతమంచిర్యాల, జైపూర్, మందమర్రి, భీమిని, జన్నారం ఆరోగ్య కేంద్రాలకు జారీ చేశారు.