దస్తురాబాద్, అక్టోబర్ 7 : నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలం దేవునిగూడెం మారుమూల గ్రామానికి చెందిన పొరండ్ల కిష్టయ్య-బుచ్చవ్వ దంపతుల కూతరు పోరండ్ల మౌనిక జాతీయ స్థాయి సైక్లింగ్ పోటీలకు ఎంపికైంది. తెలంగాణ సైక్లింగ్ ఆధ్వర్యంలో గత నెల 25వ తేదీన కరీంనగర్ జిల్లా కొత్తపెల్లి-వెలిచాల రోడ్డు మధ్య జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో తృతీయ స్థానంలో నిలిచింది. వరంగల్లో బీపీఈడీ(వ్యాయామ విద్య) చదువుతున్నది. తన మిత్రురాలు హేమలత నేర్పిన విద్య, ఆమె ప్రోత్సాహంతోనే సైక్లింగ్పై ఆసక్తి పెంచుకున్నది. సాధన ఫలితంగా జాతీయ స్థాయికి ఎంపికైంది.
దేవునిగూడెం గ్రామానికి చెందిన కిష్టయ్యకు ముగ్గురు బిడ్డలు. వృత్తి రిత్యా కుండలు తయారు చేస్తూ, కూలిపని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అదే కష్టంతో ఇద్దరికి పెండ్లి చేశాడు. మూడో కూతురు మౌనికను చదివిస్తున్నాడు. రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి. భార్య బుచ్చవ్వ అనారోగ్యంతో బాధపడుతున్నది. మౌనిక ప్రాథమిక విద్య సొంత ఊరిలోనే పూర్తిచేసింది. 10వ తరగతి అంబారిపేటలో పూర్తి చేసింది. కడెం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ పూర్తి చేసింది. కుటుంబంపై ఆర్థిక భారం పడకుండా కడెం మండల కేంద్రంలోని మీ సేవా కేంద్రంలో పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ డిగ్రీ చదివింది. పీఈసీఈటీ ప్రవేశ పరీక్ష రాసి, బీపీఈడీ కాకతీయ యునివర్సీటీలో సీటు సాధించింది. అదే క్రమంలో జాతీయ సైక్లింగ్ క్రీడాకారిణి హేమలతతో పరిచయం ఏర్పడింది. తన ద్వారా మెలకువలు నేర్చుకున్నది. జాతీయ స్థాయికి అర్హత సాధించింది. ఆ పోటీల్లో పాల్గొనాలంటే ఖర్చుతో కూడుకున్నది. సైకిల్ కొనాలంటే సుమారు రూ.2 లక్షల వరకు ఉంటుంది. కొనలేని పరిస్థితిలో ఉన్న మౌనిక.., దాతల సాయం కోసం ఎదురుచూస్తున్నది. ఎవరైనా సాయం చేస్తే మంచి స్థానం సంపాదిస్తానని ఆశపడుతున్నది.