ఆదిలాబాద్, నవంబర్ 9 ( నమస్తే తెలంగాణ) : టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రాజకీయ వ్యభిచారిగా వ్యవహరిస్తున్నారు.. టికెట్లు అమ్ముకుంటూ రాజకీయ బ్రోకర్గా మారాడని ఆదిలాబాద్లో ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన నాయకులు సాజిద్ఖాన్, గండ్రత్ సుజాత, సంజీవ్రెడ్డి మండిపడ్డారు. గురువారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఆదిలాబాద్ పర్యటనకు వచ్చిన రేవంత్ రెడ్డి సీనియర్ నాయకుడు దివంగత రామచంద్రారెడ్డి ఫొటోకు ప్రచార సభలో కనీసం నివాళులర్పించలేదన్నారు.
ఏఐసీసీ నాయకులు మల్లికార్జున్ ఖర్గే, సోనియాగాంధీ, రాహుల్గాంధీలు రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులను ఫోన్లో పరామర్శిస్తే ఆదిలాబాద్కు వచ్చిన టీపీసీసీ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులను కనీసం పరామర్శించలేదన్నారు. ఆదిలాబాద్లో కంది శ్రీనివాస్రెడ్డిని గెలిపిస్తానని రామచంద్రారెడ్డి ఏనాడు చెప్పలేదని, అన్ని అబద్ధాలు మాట్లాడారు. ఆయన తమ ముగ్గురిలో ఎవరికైనా టికెట్ ఇవ్వమన్నారే తప్ప కంది శ్రీనివాస్ రెడ్డికి వద్దని చెప్పారని నేతలు తెలిపారు. ఈ విషయంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హైదరాబాద్ పెద్దమ్మగుడిలో, కంది శ్రీనివాస్ రెడ్డి ఆదిలాబాద్ గుడిలో ప్రమాణం చేయాలని వారు సవాల్ విసిరారు.
ఈ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ టికెట్లను అమ్ముకున్నారని అధికారంలోకి రాకముందే దోపిడి ప్రారంభించారన్నారు. బోథ్ టికెట్ మార్పు విషయం ఇందుకు నిదర్శమని తెలిపారు. ఆదివాసీ నాయకుడు వన్నెల అశోక్కు టికెట్ కేటాయించి బీఫాం ఇవ్వకుండా మరో వ్యక్తికి ఇచ్చారని, 11 రోజుల ప్రచారం నిర్వహించిన ఆయనను పక్కన పెట్టారన్నారు. తుపాకీ, కత్తులు లేకుండా హత్యలు చేసి వ్యక్తి రేవంత్ రెడ్డి అని అన్నారు. కష్టకాలంలో పార్టీ జెండాను మోసిన వారిని కాదని టికెట్లు అమ్మిన రేవంత్కు ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామన్నారు. నేడు ఇండిపెండెంట్ అభ్యర్థిగా సంజీవ్రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నట్లు నాయకులు పేర్కొన్నారు.