ఆదిలాబాద్, డిసెంబర్ 19(నమస్తే తెలంగాణ) : కేంద్ర ప్రభు త్వం సీసీఐ(కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) ద్వారా పత్తి కొనుగోలు చేస్తున్నది. క్వింటాలుకు రూ.7,020 మద్దతు ధర పెట్టి మార్కెట్ యార్డుల్లో కొంటున్నది. కొన్ని చోట్ల సీసీఐ సక్రమంగా కొనకపోవడంతో ప్రైవేట్ వ్యాపారులకు తక్కువ ధరకు విక్రయిస్తున్నారు. ఆదిలాబాద్ మార్కెట్యార్డులో సీసీఐ ఆధా ర్ అథంటికేషన్ విధానంలో పత్తి కొనుగోలు చేస్తున్నది. రైతుల వేలిముద్రలు సేకరిస్తున్నది. మద్దతు ధర వస్తుందని ఆశించిన అన్నదాతలకు నిరాశే మిగులుతున్నది. సీసీఐ మూడు రోజుల్లో వేయాల్సిన డబ్బులు పక్షం రోజులైనా ఖాతాల్లో జమ చేయడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు మాత్రం ఆధార్ లింక్ ఉన్న బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమవుతున్నాయని పేర్కొంటున్నారు. ఒక్కో రైతుకు రెండు, మూడు బ్యాం కుల ఖాతాలు ఉండడంతో ఏ బ్యాంకులో డబ్బులు పడ్డాయో తెలియక బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. కొందరు రైతులు అప్పు చెల్లించాల్సి ఉండడంతో బ్యాంకర్లు డబ్బులను రుణం కింద జమ చేసుకుంటున్నారు. డబ్బల జాప్యంపై రైతు సంఘా ల నాయకులు, రైతులు మంగళవారం జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి శ్రీనివాస్కు ఫిర్యాదు చేశారు. సీసీఐ డబ్బులు సక్రమంగా అందేలా చూడాలని, రుణం కింద డబ్బులు బ్యాంకర్లు జమ చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
డబ్బులు ఇప్పించండి..
ఈ నెల 14వ తారీకున ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో 16 క్వింటాళ్ల పత్తి సీసీఐకి అమ్మిన. పట్టా పాసు పుస్తకం, బ్యాంకు పాస్బుక్, ఆధార్ జిరాక్స్ కాపీలు ఇచ్చినం. వేలి ముద్ర తీసుకుని ఆధార్ విధానంలో దూది కొనుగోలు చేశారు. రూ.1.17 లక్షలు రావాలి. మూడు రోజుల్లో పైసలు బ్యాంకు ఖాతాల్లో పడుతాయని అధికారులు చెప్పారు. ఆరు రోజులవుతున్నా పడలేదు. నాకు రామాయిలోని గ్రామీణ బ్యాంకు, ఆదిలాబాద్లోని ఎస్బీఐలో ఖాతాలు ఉన్నాయి. నాలుగు రోజుల నుంచి బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నా పైసలు పడలేదని చెబుతున్నారు. సీసీఐ అధికారులు మాత్రం వేశామని అంటున్నరు. ఏమి చేయాలో తోచడం లేదు. అధికారులు నాకు పంట డబ్బులు ఇప్పించాలి.
– భూంరెడ్డి, రైతు, రామాయి, జైనథ్ మండలం
అధికారులు చర్యలు తీసుకోవాలి..
పత్తి కొనుగోళ్లలో ఆధార్ అథంటికేషన్ విధానం వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మహిళా రైతులు పత్తిని విక్ర యిం చడానికి మార్కెట్ యార్డుకు వచ్చి గంటల తరబడి నిరీక్షిస్తు న్నారు. అన్నదాతలకు రెండు, మూడు బ్యాంకు ఖా తాలు ఉండడంతో ఏ ఖాతాలో డబ్బులు పడ్డాయో తెలియ డం లేదు. పత్తి విక్రయించేటప్పుడు ఆధార్, పట్టా, బ్యాంకు పాసు పుస్తకాలు ఇస్తున్నాం. రైతులు ఇచ్చిన బ్యాంకు ఖాతాల్లో డబ్బులు పడేలా అధికారులు చర్యలు తీసుకోవాలి.
– స్వామి, రైతు, యాపల్గూడ, ఆదిలాబాద్ రూరల్ మండలం
సహాయ కేంద్రం ఏర్పాటు చేయండి..
రైతులు అమ్మిన పత్తి డబ్బులు బ్యాంకుల్లో జమ కావడంలో తీవ్ర జాప్యం జరుగుతున్నది. రైతులకు సంబంధించిన ఏ బ్యాంకు ఖాతాల్లో డబ్బులు పడుతున్నాయో తెలియడం లేదు. కొందరు బ్యాంకర్లు రైతుల పంట డబ్బులను రుణం కింద జమ చేసుకుంటున్నారు. రైతులు ఇచ్చిన బ్యాంకు వివరాల ప్రకారం డబ్బులు జమ చేయడం లేదు. ఈ సమస్యల పరిష్కారం కోసం అధికారులు మార్కెటింగ్ కార్యాలయంలో సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి.
– బండి దత్తాత్రి, తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు