మంచిర్యాల, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ);పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు రాష్ట్ర సర్కారు డబుల్ బెడ్ రూంలు నిర్మిస్తున్నది. ఈ మేరకు చెన్నూర్ నియోజకవర్గ వ్యాప్తంగా రూ. 6.07 కోట్ల అంచనా వ్యయంతో 1,146 గృహాలను జీ+2 విధానంలో కట్టిస్తున్నది. క్యాతనపల్లి మున్సిపాలిటీ, మందమర్రిలో రెండు పడక గదుల ఇండ్లు తుది దశకు చేరుకోగా, చెన్నూర్లో సైతం శరవేగంగా పనులు చేపడుతున్నది. ప్రభుత్వ విప్ బాల్క సుమన్ నిత్యం సమీక్షిస్తూ.. దిశానిర్దేశం చేస్తుండగా, వచ్చే ఫిబ్రవరిలోగా పూర్తి చేసే లక్ష్యంతో యంత్రాంగం ముందుకెళ్తున్నది. మోడల్ కాలనీలకు ఏమాత్రం తీసిపోని విధంగా సకల సౌకర్యాలతో నిర్మాణాలు చేపడుతుండగా, ఇటీవల పర్యటించిన మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, ఎంపీ వెంకటేశ్ నేతకాని సంతృప్తి వ్యక్తం చేశారు. త్వరలోనే అర్హులకు అందించే అవకాశముండగా, పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్ర సర్కారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘డబుల్ బెడ్రూం ఇండ్లు’ చెన్నూర్ నియోజకవర్గంలో శరవేగంగా కొనసాగుతున్నాయి. ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ప్రత్యేక చొరవతో నియోజకవర్గ వ్యాప్తంగా 1,146 ఇండ్లను రూ.6,073.80 లక్షల అంచనా వ్యయంతో, జీ ప్లస్ 2 పద్ధతిలో నిర్మిస్తున్నారు. క్యాతనపల్లి మున్సిపాలిటీలో రూ.15.15 కోట్లతో 286, మందమర్రిలో రూ.29.68 కోట్లతో 560 (మొదటి విడుతలో 400, రెండో విడుతలో 160) ఇండ్ల నిర్మాణం శరవేగంగా సాగుతున్నది. చెన్నూర్లో రూ.1590 లక్షల అంచనా వ్యయంతో 300 ఇండ్లు నిర్మిస్తున్నారు. మందమర్రిలో మొదటి విడుతలో నిర్మిస్తున్న 400 గృహాలు, క్యాతనపల్లి మున్సిపాలిటీలో నిర్మిస్తున్న 286 ఇండ్లు తుది దశకు చేరుకోగా, ప్రస్తుతం రంగులు వేస్తున్నారు. ఆర్అండ్బీ ఇంజినీర్లు బావుసింగ్, హరీశ్ నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఇటీవల మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, విప్ బాల్క సుమన్, ఎంపీ వెంకటేశ్ నేతకానీతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాలను పరిశీలించారు. త్వరలో ఇవి అందుబాటులోకి రానుండగా, పేద, మధ్య తరగతి వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
మందమర్రి మున్సిపాలిటీలో 560, చెన్నూర్లో 300..
మందమర్రి మున్సిపాలిటీకి చెందిన మందమర్రి గ్రామంలో సర్వే నంబర్ 148లో 560 డబుల్ రూం ఇండ్లను జీ ప్లస్ 2 విధానంలో నిర్మిస్తున్నారు. పట్టణం నడబొడ్డున మందమర్రి- క్యాతనపల్లి ప్రధాన రహదారి పక్కన నాలుగో వార్డులో ఇండ్ల నిర్మాణం కొనసాగుతున్నది. మొదటి విడుతలో 400, రెండో విడుతలో 160 ఇండ్లు నిర్మిస్తున్నారు. 9 ఫిబ్రవరి 2019న పనులు ప్రారంభించారు. ఫిబ్రవరి 17, 2022 లోగా పూర్తి చేసే లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. ఇందులో 400 ఇండ్ల నిర్మాణం పూర్తికాగా రంగులు కూడా వేశారు. ఇంటిలో విద్యుత్, ఫ్యాన్, విద్యుత్ బల్బుల పనులు కావాల్సి ఉంది. రెండో విడుతలో 160 ఇండ్లు నిర్మాణ దశలో ఉన్నాయి. ఇంటి పై కప్పు పనులు పూర్తయ్యాయి. ఇంటి లోపలి గోడల నిర్మాణం కొనసాగుతున్నది. డబుల్ బెడ్ రూం ఇండ్లకు మిషన్ భగీరథ ద్వారా తాగు నీరు ఉచితంగా అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆరు నెలల్లోగా పూర్తి చేసి, ప్రభుత్వానికి అందిస్తామని ఆర్ అండ్ బీ అధికారులు పేర్కొంటున్నారు. చెన్నూర్ మున్సిపాలిటీకి (అర్బన్) చెందిన చెన్నూర్లో 300 డబుల్ బెడ్ రూం ఇండ్లను జీ ప్లస్ 2 పద్ధతిలో నిర్మిస్తున్నారు. రూ.1590 లక్షల అంచనా వ్యయంతో నిర్మాణం చేపట్టారు.
క్యాతనపల్లి మున్సిపాలిటీలో 286..
క్యాతనపల్లి మున్సిపాలిటీలోని క్యాతనపల్లి గ్రామంలో 286 డబుల్ బెడ్ రూం ఇండ్లను జీ ప్లస్ 2 పద్ధతిలో నిర్మిస్తున్నారు. 11 బ్లాక్లలో 24 ఇండ్లు, ఒక బ్లాక్లో 22 ఇండ్ల చొప్పున మొత్తం 12 బ్లాకులలో డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం కొనసాగుతున్నది. రూ.15.15 కోట్ల అంచనా వ్యయంతో, నవంబర్ 14, 2019న ప్రారంభించారు. వచ్చే ఫిబ్రవరిలోగా నిర్మాణం పూర్తి చేసేలా పనులు వేగవంతం చేశారు. ఒక హాలు, రెండు పడకగదులు, కిచెన్, టాయిలెట్, బాత్ రూంతో పాటు కనీస సౌకర్యాలతో నిర్మిస్తుండగా, ప్రస్తుతం ఇండ్లకు రంగులు వేస్తున్నారు. ఇండ్ల నిర్మాణ పనులను ఆర్అండ్బీ శాఖకు చెందిన ఇంజినీర్లు బావుసింగ్, హరీశ్ పర్యవేక్షిస్తున్నారు.
విప్ ప్రత్యేక చొరవ.. నిరంతరం పర్యవేక్షణ.
ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ ప్రత్యేక చొరవతో రెండు పడకల గదుల ఇండ్ల పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఆయా కాలనీల్లో అంతర్గత సీసీ రోడ్లు, మురుగు కాలువలు, విద్యుత్, నీటి సౌకర్యం పనులు పూర్తి చేసి త్వరలో గృహ ప్రవేశాలకు సిద్ధం చేయనున్నట్లు సంబంధిత శాఖ అధికారులు పేర్కొన్నారు. గృహ నిర్మాణ పనులను ఆర్అండ్బీ శాఖ ఇంజినీర్లు బావు సింగ్, హరీశ్ నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. పనులను ఇటీవల మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, విప్ బాల్క సుమన్, ఎంపీ వెంకటేశ్ నేతకానీతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. దీంతో పేదల సొంతింటి కల నెరవేరుతుండడం, డబుల్ ఇండ్ల నిర్మాణం చురుగ్గా కొనసాగుతుండడంతో నియోజకవర్గ ప్రజలు సంబురపడుతున్నారు.
పేదల కల నెరవేరబోతున్నది..
పేదల కల త్వరలో నెరవేరబోతున్నది. మందమర్రి, క్యాతనపల్లిలో డబుల్ బెడ్ రూం ఇండ్ల పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఆర్ అండ్ బీ అధికారులతో నిత్యం సమీక్షిస్తూనే ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయిలో పనులు పరిశీలిస్తున్నాం. ఇటీవల మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపీ వెంకటేశ్ నేతకాని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. పనులు స్పీడ్గా కొనసాగుతున్నాయి. త్వరగా ఇండ్లు పూర్తి చేసి అర్హులకు అందిస్తాం.