కెరమెరి, మార్చి 4: కుమ్రం భీం పోరాటం స్ఫూర్తిదాయకమని నూతన కలెక్టర్ వెంకటేశ్ దౌత్రే అన్నారు. సోమవారం కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం అదనపు కలెక్టర్ దీపక్ తివారీతో కలిసి నేరుగా జోడేఘాట్ను సందర్శించారు. భీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పక్కనే నిర్మించిన భీం స్మారక మ్యూజియాన్ని సందర్శించారు. ఆదివాసుల సంస్కృతి, ఆచార వ్యవహారాల గురించి అసిస్టెంట్ క్యూరేటర్ దుందేరావ్ను అడిగి తెలుసుకున్నారు.
కలెక్టర్ మాట్లాడుతూ ఆదివాసీల హక్కుల కోసం విరోచిత పోరాటం చేసి అమరుడైన భీం పేరిట ఏర్పాటు చేసిన జిల్లాల్లో పని చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ సహకారంతో అర్హులైన అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందేలా చూస్తామని, ప్రతి గ్రామాభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు. కలెక్టర్ను తహసీల్దార్ దత్తు ప్రసాద్ సత్కరించారు. కార్యక్రమంలో డీడీ రమాదేవి, ఎంపీపీ పెందోర్ మోతీరాం, ఎంపీడీవో కృష్ణారావు, ఎస్ఐ విజయ్, ఎంపీవో అమ్జద్పాషా, నాయకులు పెందోర్ రాజేశ్వర్, జగన్నాథ్రావ్, తదితరులు పాల్గొన్నారు.