ఆసిఫాబాద్, ఫిబ్రవరి 12 : ప్రజావాణి ద్వారా ప్రజా సమస్యల పరిషారానికి కృషి చేస్తున్నట్లు కలెక్టర్ బోరడే హేమంత్ సహదేవరావు అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారీతో కలిసి అర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఆసిఫాబాద్ మండలం మోతుగూడ గ్రామానికి చెందిన ఉప్పరి విజయలక్ష్మి, ఉప్పరి తిరుపతి, బర్ల బానక, ఆసిఫాబాద్కు చెందిన బాబురావు, డిగ్రీ విద్యార్థి కొండ్ర తిరుపతి ఉపాధి కల్పించాలని కోరుతూ వేర్వేరుగా దరఖాస్తులు అందజేశారు.
రెబ్బెన మండలం నారాయణపూర్ గ్రామానికి చెందిన మాదాసు కిష్టయ్య తన తండ్రి నుంచి వారసత్వంగా రావాల్సిన భూమిని తమ పెద్ద అన్న పేరిట నమోదు చేశారని, దీన్ని సవరించి ముగ్గురు అన్నదమ్ములకు సమానంగా పంచాలని కోరుతూ దరఖాస్తు అందజేశాడు. ప్రజావాణి కార్యక్రమానికి అందిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి పరిషరిస్తామని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.