మంచిర్యాల అర్బన్, ఏప్రిల్ 1 : ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కచ్చితంగా అమలు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బదావత్ సంతోష్ పేర్కొన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులు, ఇతర ప్రిసైడింగ్ అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ సభావత్ మోతీలాల్, మంచిర్యాల ఆర్డీవో, మంచిర్యాల నియోజక వర్గ రిటర్నింగ్ అధికారి రాములుతో కలిసి హాజరయ్యారు.
ఆయన మాట్లాడుతూ పోలింగ్ సమయంలో ఎలాంటి సమస్యలు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, పోలింగ్ రోజున ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల విషయంలో ఇబ్బంది తలెత్తితే వెంటనే చర్యలు తీసుకోవాలని, ఫారం-13డీ, పోస్టల్ బ్యాలెట్ ఓట్ల ప్రక్రియను పర్యవేక్షించాలన్నారు. పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని చెన్నూర్, బెల్లంపల్లి, మంచిర్యాల శాసనసభ నియోజక వర్గాల్లో 741 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని, ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులు తమ పరిధిలోని పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అనంతరం బ్యాలెట్ యూనిట్లు, వీవీ ప్యాట్ల పనితీరు వివరించడంతో పాటు పోలింగ్ ప్రక్రియకు సంబంధించి ఫారాలు నింపే విధానంపై వారికి అవగాహన కల్పించారు.
చెన్నూర్, ఏప్రిల్ 1 : ఎన్నికల విధులను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. సోమవారం చెన్నూర్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పీవో, ఏపీవోలకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఎన్నికల నిర్వహణలో పాల్గొనే ఉద్యోగులకు విధులు, నిబంధనలపై అవగాహన కల్పించారు. ఎ న్నికల్లో పాల్గొనే వారంతా పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించు కోవాలని సూచించారు. నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి చంద్రకళ, చెన్నూర్, కోటపల్లి, భీమారం, జైపూర్ తహసీల్దార్లు మల్లికార్జున్, మహేంద్రనాథ్, సదానందం, వనజారెడ్డి, చంద్రశేఖర్, 360మంది పీవోలు, ఏపీవోలు పాల్గొన్నారు.