నేరడిగొండ, జనవరి 28 : విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని సివిల్సప్లయ్ డీఎం సుధారాణి ఉపాధ్యాయులకు సూచించారు. మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయాన్ని ఆదివారం జిల్లా సివిల్ సప్లయ్ టీం సభ్యులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాఠశాలలో అమలవుతున్న మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలని సూచించారు. స్టోర్ రూంలో ఉన్న కూరగాయలు, వంట సామగ్రిని పరిశీలించారు. వండిన ఆహారాన్ని టీం సభ్యులు రుచి చూశారు. ఆహారం విషయంలో సంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో పాఠశాలలో ఫ్యాన్లు లేవని విద్యార్థులు ఉన్నతాధికారులకు తెలపడంతో రూ.20 వేల విలువ గల 10 ఫ్యాన్లు అందజేశారు. ఇక్కడ టీం సభ్యులు అకౌంటెంట్ సంతోష్, టెక్నీషియన్ సుధాకర్, పాఠశాల ఇన్చార్జిలు మమత, షాహిన్ ఉన్నారు.