Cell Phone | ఎదులాపురం, మే 29 : ఏడాది నిండని పిల్లల చేతికి సెల్ఫోన్లు ఇచ్చేయడం.. మా పాప సెల్ఫోన్ లేనిదే అన్నం తినదండీ అని చెప్పుకోవడం సర్వసాధారణమైంది. సమయం దొరికినప్పుడల్లా స్మార్ట్ఫోన్లలో వీడియోగేమ్స్ ఆడుతున్నారు. చిన్నతనం నుంచే ఇదో వ్యసనంగా మారుతున్నది. వయసుపెరిగే కొద్ది కంటి చూపు మందగించడంతో పాటు ఆరోగ్య, మానసిక సమస్యలు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
అదుపులో పెట్టకుంటే అనర్థాలే..
రోజు రోజుకూ అందుబాటులోకి వస్తున్న సాంకేతిక పరిజ్ఙానంతో పనులు సులువుగా చక్కబెట్టుకుంటున్నాం. అయితే ఈ ఆధునాతన పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం ఎంత ముఖ్యమో.. దానిని అదుపులో పెట్టుకోవడం అంతే అవసరం. ముఖ్యంగా పిల్లల విషయంలో వీటిపై తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే అనర్థాలు కొనితెచ్చుకున్నట్లే అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గతంలో క్రికెట్, వాలీబాల్లాంటి క్రీడల ద్వారా శారీరక శక్తిని పెంచుకునేవారు. దీంతో వారి ఆరోగ్యం బాగుండేది. మారిన సాంకేతిక పరిజ్ఞానంతో స్మార్ట్ ఫోన్లు, టీవీలు, ల్యాప్ట్యాప్, కంప్యూటర్లు తప్పనిసరి అయింది. దీనికి తోడు పిల్లలను బయటకు పంపించేందుకు తల్లిదండ్రులు ఇష్టపడకపోవడంతో వారంతా ఫోన్లు, టీవీలు, కంప్యూటర్లకు పరిమితమవుతున్నారు.
తల్లిదండ్రుల గారాబం
పిల్లలు సెల్ఫోన్, కంప్యూటర్లతో గంటల కొద్ది గడపడాన్ని తల్లిదండ్రులు గొప్ప విషయంగా భావిస్తున్నారు. వారు కూర్చున్న చోటకే అన్నం, పాలు, పండ్లు తదితర వాటిని అందజేస్తున్నారు. ఇక చిన్న పిల్లలు ఏడిస్తే వారికి సెల్ఫోన్ ఇచ్చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల వారి జీవితంపై చెడు ప్రభావం పడుతుందని, నేడు 10 ఏళ్లలోపు పిల్లలు కంటి సమస్యలతో బాధపడుతున్నారని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మార్పు తీసుకురాకపోతే భవిష్యత్లో మరిన్ని ఇబ్బందులు తప్పవని తరచూ చెబుతున్నారు. దృష్టి లోపం ఉన్న వారిని సైనిక ఉద్యోగాల్లో తీసుకోని విషయం తెలిసిందే. మనకు తెలియకుండానే ఉపాధి అవకాశాలకు గండి పడే ప్రమాదముంది.
చదువుపై ఆసక్తి తగ్గే ప్రమాదం
పిల్లలు వీడియో గేమ్స్ ఆడే సమయంలో శరీరంలో అడిషనల్ హార్మోన్స్ ఎక్కువగా విడుదలవుతుంటాయి. ఇలా మోతాదుకు మించి విడుదల కావడం శరీరానికి మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. వీడియో గేమ్స్ ఆడడంపై ఆసక్తి పెరిగితే పిల్లలు చదువుపై శ్రద్ధ చూపరు. ఇలాంటి వాటిని దృష్టిలో ఉంచుకొని పిల్లలు పరిమిత సమయం కన్నా.. ఎక్కువ సేపు స్మార్ట్ఫోన్లతో ఆడకుండా తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
స్మార్ట్ ఫోన్ వాడకం తగ్గించాలి
చిన్న పిల్లలు, పెద్దలు స్మార్ట్ఫోన్ను అధికంగా వాడుతున్నారు. దీనివల్ల కంటిచూపుపై తీవప్రభావం పడుతుంది. దగ్గర చూపు కనబడుతుంది. దూరంచుపు సన్నగిల్లుతుంది. తల నొప్పి వస్తుంది. కండ్లనుంచి నీరు కారడం ఎక్కువ అవుతుంది. దీంతోపాటు వివిధ సమస్యలు వస్తాయి. చిన్న వయసులో పెద్ద కండ్లద్దాలు పెట్టుకోవాల్సి వస్తుంది. స్మార్ట్ఫోన్ వాడకం తగ్గించకుంటే తిప్పలు తప్పవు. పిల్లలు సెల్ఫోన్ల గేమ్స్కు దూరంగా ఉంచాలి. అవుట్డోర్ గేమ్లు ఆడుకునేలా చూడాలి.
– ఇద్రీస్ అక్బానీ, ఆప్తమాలజిస్ట్ హెచ్వోడీ, రిమ్స్
ఫిజికల్ యాక్టివిటీని పెంచాలి..
పిల్లలను ఫోన్ నుంచి దృష్టి మళ్లించడానికి ఫిజికల్ యాక్టివిటీని పెంచాలి. పార్క్కు తీసుకెళ్లాలి. పేరెంట్స్ కూడా వాళ్లతో కలిసి ఆడాలి. లేక ఆ వయసు పిల్లలతో కలిసి ఆడుకునే వీలు కల్పించాలి. స్మార్ట్ ఫోన్ వాడడం వల్ల వచ్చే సమస్యల గురించి అర్థమయ్యేలా వివరించాలి. నిత్యం సెల్ఫోన్ గేమ్స్లో లీనమవ్వడం వల్ల శారీరక వ్యాయామం ఉండదు. నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్లో ఇబ్బందులు తప్పవు.
– డాక్టర్ హేమలత రెడ్డి, పీడియాట్రిషన్ హెచ్వోడీ రిమ్స్