ఎదులాపురం, జనవరి 23 : మానవ అక్రమ రవాణా, బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంఆర్ సునీత అన్నారు. జిల్లా కేంద్రంలోని న్యాయసేవాధికార సంస్థ సమావేశ మందిరంలో సోమవారం పారా లీగల్ వలంటీర్లకు ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ మానవ అక్రమ రవాణా, బాల కార్మికుల బాధితుల కష్టాల గురించి పారా లీగల్ వలంటీర్లకు అవగాహన ఉంటుందన్నారు. బాధితులకు తక్షణ సహాయం అందించేలా కృషి చేయాలని, అందులో భాగంగానే శిక్షణ కార్యక్రమాలు డీఎల్ఎస్ఏ ద్వారా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
శిక్షణను సద్వినియోగం చేసుకుంటూ బాధితులకు భరోసా కల్పించాలన్నారు. అనంతరం రంగారెడ్డి జిల్లాకు చెందిన రిసోర్స్పర్సన్లు వివిధ అంశాలపై వలంటీర్లకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు సతీశ్ కుమార్, డీఎల్ఎస్ఏ కార్యదర్శి క్షమాదేశ్పాండే, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నగేశ్ పాల్గొన్నారు.