కాసిపేట, డిసెంబర్ 24 : క్రిస్మస్ పండుగకు సోమగూడెం, బెల్లంపల్లి రహదారి మధ్యలోని కల్వరీ చర్చి సిద్ధమైంది. ఆదివారం రాత్రి నుంచే ప్రత్యేక ప్రార్థనలకు ఏర్పాట్లు చేశారు. ఈ ప్రాంతంలో అతి పెద్ద చర్చి కల్వరీ కావడంతో పెద్ద సంఖ్యలో క్రైస్తవులు తరలివస్తారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మండలంలోని పలు గ్రామాల్లో ఉన్న చర్చిల్లో క్రిస్మస్ వేడుకలకు ఏర్పాట్లు పూర్తి చేశారు.
కల్వరీ చర్చికి ఈ ప్రాంతం నుంచే కాకుండా ఇతర రాష్ర్టాల నుంచి క్రైస్తవులు అధిక సంఖ్యలో హాజరవుతారు. ప్రతి ఏడాది 50 రోజుల పాటు ప్రవీణ్ పాస్టర్ చేసే ఉపవాస దీక్షల కార్యక్రమం ఇక్కడ ప్రత్యేకత చాటుకున్నది. 50 రోజులు ఉపవాస దీక్షలు చేసి దీక్షల ముగింపు సభ భారీ స్థాయిలో నిర్వహిస్తారు. ఈ సభకు భారీ సంఖ్యలో క్రైస్తవులు దేశ నలుమూలల నుంచి ఇక్కడికి వచ్చి ప్రార్థనలు చేస్తారు. ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని, సేవా దృక్పథంతో ఉండాలని కోరుతూ ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నట్లు కల్వరీ పాస్టర్ ప్రవీణ్, కల్వరీ నిర్వాహణాధ్యక్షురాలు సిస్టర్ షారోన్ తెలిపారు.
లక్షెట్టిపేట, డిసెంబర్ 24: పట్టణంలోని సీఎస్ఐ చర్చిలో శనివారం రాత్రి క్రిస్మస్ ఈవ్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. చర్చి ఫాదర్ డెవిడ్ ఫాల్ మాట్లాడుతూ క్రిస్మస్ ఈవ్ ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం భక్తులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. భక్తులు చేసిన ప్రోగ్రాంలను తిలకించి, ప్రత్యేక ప్రార్థనలు చేసి భక్తులను మనస్ఫూర్తితో ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో చర్చి కమిటీ మెంబర్స్తో పాటు భక్తులు పాల్గొన్నారు.
మందమర్రి, డిసెంబర్ 24: మందమర్రి పట్టణంలో క్రిస్మస్ వేడుకల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. వేడుకలను పురస్కరించుకుని పట్టణంలోని వివిధ ఏరియాల్లో చర్చిలను కమిటీ సభ్యులు విద్యుత్ దీపాలతో అలంకరించారు. రంగురంగుల పూలతో ఆకర్షణీయంగా అలంకరించారు. చర్చిల ఆవరణలో క్రీస్తు జననానికి ప్రతీకగా ఏర్పాటు చేసిన పశువుల పాకలను వేసి పూలు. విద్యుత్ దీపాలతో అలంకరించారు. షామీయానాలను వేయడంతో పాటు తాగునీటిని అందుబాటులో ఉంచుతున్నట్లు కమిటీల సభ్యులు తెలిపారు. సీఎస్ఐ చర్చి ఆవరణలో ఏర్పాటు చేసిన పశువుల పాక వద్ద ఆదివారం ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
రామకృష్ణాపూర్, డిసెంబర్ 24: క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రామకృష్ణాపూర్ సీఎస్ఐ చర్చిలో చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి పేద క్రైస్తవులకు దుస్తులు పంపిణీ చేశారు. ఆదివారం క్రిస్మస్ వేడుకలను పురస్కరించుకొని చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్లు రామకృష్ణాపూర్ సీఎస్ఐ చర్చిని సందర్శించారు. ఈ సందర్భంగా క్రిస్మస్ కేక్ కట్చేసి క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపారు. వృద్ధులకు చీరెలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో చర్చి పాస్టర్ జాషువా, మెదక్ చర్చి సెక్రటరీ డొలకల డేవిడ్, గుండమల్ల పుష్పరాజ్ ఆనంద్, ఐఎన్టీయూసీ యూనియన్ నాయకులు జనక్ ప్రసాద్, కాంపెల్లి సమ్మయ్య, తేజావత్ రాంబాబు, పలిగిరి కనకరాజ్, మారెపల్లి రాజయ్య, జంగంపల్లి మల్లయ్య, ఉప్పులపు సురేశ్ తదితరులున్నారు.