ఆదిలాబాద్, జూన్ 16 ( నమస్తే తెలంగాణ) : వానకాలం ప్రారంభమైనా ఆదిలాబాద్ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. నైరుతి రుతపవనాల రాక ఆలస్యం ఫలితంగా వర్షాల పడకపోవడంతో ఎండల ప్రభావం కొనసాగుతున్నది. జిల్లాలో గరిష్ఠంగా 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జిల్లాలోని అన్ని మండలాల్లో ఎండల తీవ్రత అధికంగా ఉంటున్నది. ఉదయం 8 గంటలకే భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. సాయంత్రం 6 గంటల వరకు ఎండ ప్రభావం కొనసాగుతున్నది. ఎండలకు వడగాలులు తోడవడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వాయవ్య భారతం నుంచి వస్తున్న వేడిగాలుల ఫలితంగా ఎండల ప్రభావం ఎక్కువగా ఉందని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు.
మధ్యాహ్నం సమయంలో రోడ్లపై జనసంచారం కనపడడం లేదు. పగటిపూట సూర్యుడి ప్రభావం కారణంగా ఎండవేడి తట్టుకోలేకపోతున్నారు. ఉక్కపోత నుంచి ఉపశమనం పొందడానికి ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లను ఉపయోగిస్తుండడంతో విద్యుత్ వాడకం పెరిగింది. మూగజీవాల పరిస్థితి దయనీయంగా మారింది. ఎండల తీవ్రత కారణంగా ప్రైవేట్ పాఠశాలలు ఒకేపూట నడుస్తున్నాయి. జిల్లాలో ఏటా వానకాలంలో పంటల సాగుకు సంబంధించి జూన్ మొదటి వారంలో ఒకటి, రెండు వానలు పడగానే రైతులు విత్తనాలు వేస్తారు.
సీజన్ ప్రారంభమైనా ఇప్పటి వరకు ఒక్క వాన పడలేదు. ఇప్పటికే భూములను సిద్ధం చేసుకొని విత్తనాలు కొనుగోలు చేసి వర్షంకోసం రైతులు ఎదురుచూస్తున్నారు. వర్షాల రాక జాప్యం కారణంగా పంటలు సాగు సైతం ఆలస్యం కానున్నది. జిల్లాలో మరో నాలుగు రోజులు ఎండల ప్రభావం ఉంటుందని వాతవారణ శాఖ అధికారులు అంటున్నారు. ఎండల నుంచి రక్షణ పొందడానికి ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఉదయం, సాయంత్రం సమయాల్లో తమ పనులు చేసుకోవాలని చెబుతున్నారు.