ఆదిలాబాద్ రూరల్, అక్టోబర్ 25 : ఇంటింటికీ సంక్షేమ పథకాలను అందిస్తూ, సామాన్య ప్రజలకు అండగా నిలుస్తున్నామని, పదేళ్లలోనే అన్ని రంగాల్లో గణనీయ పురోగతిని సాధించామని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జోగు రామన్నను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ బుధవారం జిల్లా కేంద్రంలోని రిక్షాకాలనీలో ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ తిరుగుతూ బీఆర్ఎస్ ప్రకటించిన మ్యానిఫెస్టో ప్రతులను పంపిణీ చేసి వాటి గురించి వివరిస్తూ కారు గుర్తుకే ఓటు వేయాలని అభ్యర్థించారు. పలువురు వృద్ధులు, స్థానికులు చైర్మన్ను సాదరంగా స్వాగతం పలికారు. ప్రజల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ మాట్లాడుతూ ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీకి విశేషమైన ప్రజాదరణ లభిస్తోందని అన్నారు. ప్రతి ఇంట్లో ఏదో ఒక పథకం ద్వారా లబ్ధిపొందుతున్న వారు ఉన్నారని పేర్కొన్నారు. రిక్షాకాలనీ పరిధిలో దాదాపు రూ.2 కోట్ల 50 లక్షల వ్యయంతో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని గుర్తు చేశారు. పట్టణాభివృద్ధితో పాటు ప్రజా సంక్షేమానికి విశేష ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. రానున్న ఎన్నికల్లో అభివృద్ధికే పట్టం కట్టాలని కోరారు. కార్యక్రమంలో కౌన్సిలర్ ఆవుల వెంకన్న, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, నాయకులు శివకుమార్, ఇబ్బు, తదితరులు పాల్గొన్నారు.
పట్టణంలోని వడ్డెర కాలనీకి చెందిన దండ్ల రాయుడు ఇటీవల జరిగిన పీజీ ప్రవేశ పరీక్షలో సత్తా చాటారు. నిజాం కళాశాలలో ఎకనామిక్స్ విభాగంలో సీటు సాధించిన యువకుడి ఆర్థిక స్థితిగతులను తెలుసుకున్న మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ హాస్టల్ ఫీజు కోసం రూ.10 వేల ఆర్థిక సాయం అందజేసి సేవా దృక్పథాన్ని చాటారు. అత్యవసర సమయంలో తనకు అండగా నిలిచిన మున్సిపల్ చైర్మన్కు సదరు యువకుడు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు వీరన్న పాల్గొన్నారు.